Thursday, April 25, 2024
HomeTrending NewsTSPSC:కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ - రేవంత్ రెడ్డి

TSPSC:కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ – రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇస్తున్నారని.. దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్‌ కు సమాచారం ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్లలో నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బ్యాంకు లావాదేవీల కంటే ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి, మనీలాండరింగ్, హవాలాతోపాటు విదేశాల్లో లావాదేవీలు జరిగాయి. కాబట్టి సిట్ ఒక్కటే ఈ కేసును విచారించలేదు. కాబట్టి సీబీఐ, ఈడీ, ఏసీబీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సిందే అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు గత రెండు, మూడు రోజులుగా అపాయింట్‌మెంట్ అడుగుతుంటే సీబీఐ, ఈడీ డైరెక్టర్లు తమకు సమయం ఇవ్వడం లేదన్నారు. ఈ మీడియా సమావేశం చూసి అయినా తమకు వెంటనే అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి అవినీతి నిరోధక చట్టం కూడా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. కానీ సిట్ అవినీతి నిరోధక చట్టం కింద ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెడితే..ఈ కేసులు ఏసీబీ పరిధిలోకి వెళ్తాయి. ఏసీబీ కోర్టుకు క్రిమినల్ కేసులను కూడా విచారించే అధికారం ఉంటుంది. తద్వారా విచారణ త్వరగా ముగుస్తుంది. సీబీఐకి కేసు ఇస్తే ఈడీ కూడా వస్తుంది. అప్పుడు ఇంకా సత్వరంగా కేసులు తేలే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం నిందితుల మీద పెట్టిన సెక్షన్లు, సాధారణ కోర్టుల్లో విచారణ జరిగితే ఈ కేసు తేలడానికి ఏళ్ల సమయం పడుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఈ కేసు నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోవడానికి.. ఎదురుదాడి చేస్తూ.. విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేపర్ లీకేజీ విషయాన్ని తామే పసిగట్టామని కేటీఆర్ చెప్పడం అబద్దం అన్నారు. డబ్బు పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే.. నిందితుల ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీ బయటపడిందన్నారు. దీన్ని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు రావడంతో విధిలేని పరిస్థితుల్లోనే టీఎస్పీఎస్సీ బేగంపేట పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకు ప్రభుత్వం కేసును సిట్ కు అప్పగించింది.
తెలంగాణలో ఏదైనా సంచలన సంఘటనలు జరిగినప్పుడు.. అందులో ప్రభుత్వ పెద్దల పాత్ర కనిపించినప్పుడు… వారిని కాపాడేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి సిట్ ను నియమిస్తోందని చెప్పారు. ఎంసెట్, నయీం కేసుల నుంచి మొదలు ఇప్పటివరకూ వివిధ కేసుల్లో సిట్ ఒక్క నివేదికను కూడా ఇవ్వలేదని, నిందితులపైనా చర్యలు తీసుకోలేదని చెప్పారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు సిట్ మాకు నోటీసులు, కేటీఆర్ కు సమాచారాన్ని ఇస్తోంది. సిట్ విచారణ కేటీఆర్ కనుసైగల్లోనే జరుగుతోంది. సిట్ విచారణ నివేదికను కోర్టుకు ఇవ్వకముందే జగిత్యాలలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు ఎలా వచ్చింది. ఈ ఇష్యూలో కేటీఆర్ పీఏ తిరుపతి చిన్న పావు మాత్రమే అని అన్నారు. కేటీఆర్ వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉంది. ఆయనకు నోటీసులు ఇవ్వకపోగా మాపై క్రిమినల్ కేసులు పెడతామని మీడియాకు లీకులు ఇచ్చారు. కేటీఆర్ కు సమాచారం నేరగాళ్లు ఇచ్చరా?.. విచారణ అధికారి ఇచ్చారా? ఈ సమాచారం ఎవరిచ్చారో కేటీఆర్ సమాధానం చెప్పాలి. మాకు నోటీసులు ఇచ్చిన ఏఆర్ శ్రీనివాస్ కేటీఆర్ కు ఎందుకు ఇవ్వరు? దీని వెనక గూడుపుఠానీ ఏమిటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లీకేజీ వ్యవహారంతో కేటీఆర్ కు సంబంధం లేనప్పుడు.. సిట్ విచారణ జరుగుతున్న సమయంలో.. నివేదిక ఇంకా పూర్తి కాకముందే.. మంత్రి కేటీఆర్ కు పూర్తి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్ కు సమాచారాన్ని ఎవరు ఇస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ వద్ద నిర్ధిష్టమైన సమాచారం ఉందని, ఆయనకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీకేజీల్లో జరిగిన లావాదేవీలను, ప్రమేయం ఉన్న వ్యక్తులను కాపాడేందుకు కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ తత్తర, తొందరపాటు చూస్తే జనానికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. నేరాన్ని చిన్నది చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఆరోపణలు కేటీఆర్ పైనే చేస్తున్నాం. లీకేజీ విషయం కేవలం ఇద్దరు వ్యక్తులకు (ప్రవీణ్, రాజశేఖర్ ) సంబంధించినదని మంత్రి కేటీఆర్ ఎలా మాట్లాడారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిట్ నియమించిన తర్వాత ఈ విషయాన్ని కేటీఆర్ ఎలా చెప్పారన్నారు. కస్టడీలోకి తీసుకోకముందే ఇద్దరు వ్యక్తులకే సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెప్తారని మరోసారి ప్రశ్నించారు.
ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు సరిగ్గా లేదు. గతంలో హైకోర్టుకు కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆయనకు రెండు వారాల శిక్ష విధించింది. టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్న 30 లక్షల మంది, నమోదు చేసుకొని వారు 20 లక్షల మంది ఉంటారు. మొత్తమ్మీద 50 లక్షల మంది నిరుద్యోగుల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న సమస్య. కేసీఆర్ కు తెలంగాణ విద్యార్ధులు నచ్చకపోవచ్చు. కానీ జీవితాలతో చెలగాటమాడే అధికారం కేసీఆర్, కేటీఆరుకు లేదు. తెలంగాణలో నిజాయితీ పరులైన అధికారులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా ఆంధ్రా అధికారుల చేతుల్లోంచి విచారణను తప్పించాలి. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ బిడ్డలైతే తక్షణమే ఈ కేసును తెలంగాణ అధికారులతో జరిపించాలి. సీబీఐ, ఈడీ, ఏసీబీ డిపార్ట్ మెంట్స్ కలిపి సిట్ వేసి ఇందులో ఉన్న పెద్దలందరిని శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గత ఏడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూపు 1 పరీక్షలో లాలాగూడాలోని ఒక కేంద్రంలో ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరగాల్సిన పరీక్షను మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 నిమిషాల వరకూ పరీక్ష నిర్వహించారు. కావాల్సిన వ్యక్తులను ప్రత్యేకంగా కూర్చోబెట్టి.. పరీక్షలను రాయించారు. ఇతర కేంద్రాల్లోనూ కొంతమంది అభ్యర్థులకు అదనంగా సమయం కేటాయించి.. ఇతర వ్యక్తులతో పరీక్షలు రాయించారు. ఈ వివరాలను కప్పిపుచ్చారు. దీనిపై మరునాడు కొన్ని పత్రికల్లో కథనాలు వస్తే.. సంబంధిత అధికారులు వివరణ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Also Read : TSPSC: పేపర్ లీకేజీపై నివేదికకు గవర్నర్ ఆదేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్