Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏడుపాయల తీర్థం- క్షేత్రం

ఏడుపాయల తీర్థం- క్షేత్రం

Vana Durga:

“ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర!
ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర!
నీవు పారిన దారిలో ఇక్షుదండాలు
నీవు జారిన జాడలో అమృత భాండాలు
నీవు దూకిన నేల మాకు విద్యున్మాల
నీవు ప్రాకిన పథము మాకు జైత్రరథమ్ము
ఎవరికొరకయి పరుగులెత్తి వచ్చితివి?
ఎవరి జూచి తటాకమై నిల్చిపోతివి?”

అని మంజీరా నదితో మాట కలిపిన దాశరథి మధ్యలో ఏడుపాయల వనదుర్గ గురించి ప్రస్తావించారు.

“ఎవ్వరే యెదురొచ్చి ఏడుపాయలు చేసి
రవ్వల్ల వీణపై రాగమొత్తిరి నిన్ను?
ఏడుపాయల దుర్గ యేమన్నదే నిన్ను?
యేమన్నదే నిన్ను యేడుపాయల దుర్గ?
ఏడుపాయల దుర్గ ఎదురుగా వచ్చింది
పాడుకొమ్మన్నాది పరుగులిడమన్నాది
స్వర మొక్క పాయగా సాగి పొమ్మన్నాది
బంగారు పండించి ప్రజలకిమ్మన్నాది

మంజీరా నదిని వనదుర్గ ఏడుపాయలు చేసి…నీటి గలగలతో జలజలా పాడుకుంటూ…సాగిపొమ్మని చెప్పిందట. ఏడు పాయలు ఏడు స్వరాలుగా సాగుతూ బంగారు పంటలు పండించి ప్రజలకిమ్మని వనదుర్గమ్మ మంజీరకు చెప్పిందట.

ముప్పయ్యేళ్లుగా ఈ కవిత నన్ను వెంటాడుతూ ఉంది. అనేకసార్లు మెదక్ కు వెళ్లినా ఎందువల్లో ఎప్పుడూ ఏడుపాయలకు వెళ్లలేదు. మొన్న మబ్బు పట్టి…చినుకులు పడే ఒక ఆదివారాన లాంగ్ డ్రైవ్ వెళదామని నా భార్య అనగానే చలో ఏడుపాయలు అన్నాను. టిఫిన్ చేసి బల్కం పేట, బాలానగర్, జీడిమెట్ల దాటి మెదక్ దారి పట్టాము. నర్సాపూర్ అడవి దారి పచ్చగా, హాయిగా సాగింది. అడవి దారిలో కోతులకు ఆహారం వేయకండి…వేస్తే ఇరవై అయిదు వేల జరిమానా అని ఎక్కడెక్కడ అటవీ శాఖ హెచ్చరిక బోర్డులు పెట్టిందో…అక్కడే కార్లు ఆపి జనం కోతులకు ఆహారం పెడుతున్నారు!

హైదరాబాద్ ఇంటి నుండి రెండు గంటల ప్రయాణం తరువాత ఏడుపాయలు చేరుకున్నాం. దారి పొడుగునా ఆషాఢం బోనాలు; బలులకు వెళ్లే కోడి మేకలతో; మేళ తాళాలతో సందడి సందడిగా ఉంది. రంగు రంగులుగా ఏడుపాయలు పొంగిపోతోంది. జనమే జనం. మంజీరలో స్నానాలు, కాలువ గట్లు, గుట్టల మీద వంటలు…చూడ ముచ్చటగా ఉంది. గ్రామదేవతల జాతరల్లో ఉండే జోష్ అణువణువునా తొణకిసలాడుతోంది. తప్పెట దరువులకు ఊగిపోయే పూనకాలు, చేతుల్లో పసుపు పూసిన కోళ్లు, మేకలు…పుట్నాలు- మరమరాలు అమ్మే దుకాణాలు, బొమ్మల అంగళ్లతో ప్రకృతికి ప్రాకృతికంగా ఏదో పండగ జరుగుతున్నట్లు ఉంది.

కలియుగారంభంలో పండులో దూరి పరీక్షిత్తును కాటు వేసి తక్షకుడు(సర్పం) చంపేస్తాడు. తరువాత ఎప్పుడో ఆ విషయం పరీక్షిత్తు కొడుకు జనమేజయుడికి తెలుస్తుంది. తన తండ్రిని చంపిన సర్పజాతి మొత్తాన్ని బూడిద చేసి నామరూపాల్లేకుండా చేయాలని జనమేజయుడు చేసిందే “సర్పయాగం”. కొన్ని కోట్ల జాతులు అందులో పడి నశించాయి. తక్షకుడి పేరు చెప్పి స్వాహా అనగానే…తక్షకుడు చావు భయంతో ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకుంటాడు. జనమేజయుడు “స ఇంద్రతే తక్షకాయస్వాహా” అంటాడు. ఇంద్రుడి సింహాసనంతో పాటు కదిలిపోతుంది. అప్పుడు దేవతలు కలుగజేసుకుని…ఇప్పటికే కొన్ని కోట్ల సర్పజాతులు నశించాయి..శాంతించు నాయనా! అని జనమేజయుడిని చల్లబరుస్తారు. తక్షకుడు బతికిపోతాడు.

పాములకు- గద్దలకు జాతి వైరం. జనమేజయుడు సర్పయాగంలో ఫలానా కట్లపాము, నాగు పాము అని పేరు చెప్పగానే గరుత్మంతుడు ఆ పాములను కాలి గోళ్ల మధ్య తెచ్చి సర్పయాగంలో పడేసేవాడు. అలా ఆకాశమార్గంలో గరుత్మంతుడు పాములను తీసుకెళుతున్నప్పుడు వాటి రక్తం మంజీరలో పడి జలాలు ఎర్రగా అయ్యాయి. ఆ జలాలు తాగుకు, సాగుకు పనికిరాకుండా పోయాయి. దాంతో వనదుర్గ ఒక పాయను ఏడు పాయలుగా పలుచన చేసి…అందులో విషరక్తాన్ని తొలగించి…నీటిని పవిత్రీకరించింది. అందువల్ల ఇక్కడి దేవతకు “ఏడుపాయల వనదుర్గ” అన్న పేరు స్థిరపడిందని క్షేత్ర మాహాత్మ్య కథనం.

ప్రత్యేక పర్వదినాల్లో వనదుర్గను పేరుకు తగ్గట్లు చెట్ల కొమ్మలు, ఆకులు, తీగలు, పువ్వులు, కాయలు, పళ్లతో అలంకరిస్తారు. వజ్రాభరణాలకంటే వనదుర్గకు వనాలంకారాలే ఇష్టం అన్నది భక్తుల నమ్మకం.

బయట అమ్మవారికి కుంకుమార్చన చేసి…మంజీర ఏడు పాయలు పాదాలు కడుగుతుండగా రాతి గుండ్ల మధ్య స్వయంభువుగా వెలసిన వనదుర్గను దర్శించుకుని…లడ్డు ప్రసాదం తిని…హరిత హోటల్లో భోంచేయడానికి మెదక్ కోట ఎక్కాము. పన్నెండో శతాబ్దంలో కాతీయులు నిర్మించిన ఈ కోట తరువాత కుతుబ్ షాహీల చేతుల్లోకి వెళ్లింది. చారిత్రికంగా చాలా ప్రాధాన్యం ఉన్న మెదక్ కోటలో పర్యాటకులకు వసతులేమీ లేవు. కోటను ఇంకా అందంగా, ఆకర్షణీయంగా తీర్చి దిద్దవచ్చు అనిపించింది.

అక్కడి నుండి వందేళ్లకు పైబడి నిలిచి వెలుగుతున్న ప్రఖ్యాత మెదక్ చర్చిలో కలియతిరిగాము.

ఏడుపాయల దుర్గ యేమన్నదే నిన్ను?
యేమన్నదే నిన్ను యేడుపాయల దుర్గ?
స్వర మొక్క పాయగా సాగి పొమ్మన్నాది
బంగారు పండించి ప్రజలకిమ్మన్నాది”
అని మంజీర పాయలకు వనదుర్గచేత దాశరథి చెప్పించిన మాటలు చెవుల్లో మారుమోగుతుండగా…ఇంటి బాట పట్టాము.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్