Saturday, July 6, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంముఖ్యమంత్రి మార్పుకోసం సన్యాసుల పోరాటం

ముఖ్యమంత్రి మార్పుకోసం సన్యాసుల పోరాటం

“కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా- గోచిగుడ్డ నుండి మొదలై.. అంతులేని మహా సంసార ప్రయాణం దాకా సాగుతూనే ఉన్న ఆ కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే.

ఒకానొక ఊరు. పంటపొలాలతో, ధన ధాన్యాలతో పచ్చగా, హాయిగా ఉంది. ఊరిని ఆనుకుని ఊరికి కొండగుర్తుగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక శిథిలాలయ మంటపం. ఎక్కడ నుండి, ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ ఒక సన్యాసి వచ్చి ఆ మంటపం కింద గూడు కట్టుకున్నాడు. పశువుల కాపర్లు ఎవరయినా కొండమీదికి వెళ్లినప్పుడు తాము తెచ్చుకున్న సద్ది మూట విప్పి ఓ ముద్ద పెడితే తింటాడు. పెట్టకపోతే పెట్టాలని చేయి చాచి అడగడు. వచ్చినవారే దయదలిచి ఒక కాయో పండో ఇచ్చి వెళ్లేవారు.

సన్యాసికి ఒంటి మీద ఒక గోచీ గుడ్డ, కొమ్మకు ఆరేసుకున్న మరో గోచీ గుడ్డ తప్ప ఇంకెలాంటి స్థిర చరాస్తులు లేవు. ఉండాలని కోరుకోలేదు. కాలం అలా గడిచిపోతూ ఉంటే కాలం ఎందుకవుతుంది?  ఆరేసుకున్న గోచీ గుడ్డను ఎలుకలు కొరకడంతో సన్యాసికి ఎక్కడలేని కష్టాలు మొదలయ్యాయి. సర్వసంగ పరిత్యాగి ఈ విషయం మీద లోలోపల చాలా నలిగిపోతున్నాడు. ఒక శుభ ముహూర్తాన తన బాధను పశుల కాపర్లతో పంచుకున్నాడు. అయ్యో స్వామీ! ఇదా మీ బాధ? అందుకా ఈ మధ్య దిగులు దిగులుగా ఉన్నారు? రేప్పొద్దున కొండ మీదికి వచ్చేప్పుడు ఒక పిల్లిని తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళతాం. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అన్నారు. అన్నట్లుగానే పొద్దున్నే చంకలో పిల్లిని పెట్టుకుని వెళ్లారు. సన్యాసి రెండ్రోజులు గమనించాడు. ఎలుకలు మాయం. గోచీ గుడ్డ భద్రం.

అయితే ఆ కొండమీద సరయిన ఆహారం దొరకక పిల్లి మూడో రోజుకు కళ్లు తేలేసింది. సన్యాసి మనసు చివుక్కుమంది. మళ్లీ పశుల కాపర్లనే సలహా అడిగాడు. ఒంటరి పిల్లి బిక్కు బిక్కుమంటూ ఉంది. పైగా పిల్లికి పాలు పోయాలి అని రెండో పిల్లిని కూడా ప్రవేశపెట్టారు. పాల క్యాన్, గిన్నెలు, ప్లేట్లు ఎలాగూ ఉంటాయి. వారం తిరగ్గానే సన్యాసి మళ్లీ మొహం వేలాడేసుకుని ఉండడాన్ని పశుల కాపర్లు జీర్ణించుకోలేకపోయారు. ఏమి స్వామీ! ఏమయ్యింది? అని అడిగారు. జంట పిల్లులు మ్యావ్ మ్యావ్ అని నా దుంప తెంచుతున్నాయి అని బాధపడ్డాడు. మరుసటి రోజు ఉదయాన్నే రెండు అడవి కుక్కలను ప్రవేశపెట్టారు. తోడుగా రెండు ఆవులను కూడా ముందు జాగ్రత్తగా తెచ్చి కట్టి పడేసి, ఒక గుడిసె, పందిరి వేసి పెట్టారు.

సన్యాసి ఇవన్నీ చూసుకోలేక తపస్సు దారి తప్పుతోందని గ్రహించి ఊళ్లో ఈ విద్యలన్నీ తెలిసిన ఒక అనాథ యువతిని కొండమీద ఆశ్రమంలో ప్రవేశపెట్టారు. ఒకానొక కారు చీకటి కమ్మిన వేళ ఆ యువతిలో సన్యాసికి కాంతి రేఖ కనిపించింది. అంతే పెళ్లి కాకుండానే శోభనం జరిగిపోయింది. విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు పంచాయతీ పెట్టి శాస్త్రోక్తంగా పెళ్లి చేశారు. ఇంత సంసారంతో ఈ కొండమీద ఉండలేను…కొండ దిగి ఊళ్లోకి వచ్చేస్తాను అని సంసారిగా మారిన సన్యాసి చేసిన డిమాండును ఊరి జనం పెద్ద మనసుతో అంగీకరించారు. ఊరవతల అవుటర్ రింగ్ రోడ్డును ఆనుకుని సరికొత్త సంసారి సువిశాలమయిన గృహాశ్రమం కట్టుకుని పిల్లాపాపలతో, గొడ్డూ గోదాతో హాయిగా కాలం గడపసాగాడు. ఈ సన్యాసి సంసారిగా ఎందుకు మారాడు అని ఎవరయినా అడిగితే…ఆరోజు నుండి “కౌపీన సంరక్షణార్థం” అని సమాధానం వస్తోంది. కౌపీనం అంటే గోచీ గుడ్డ. సంరక్షణార్థం అంటే రక్షించుకోవడానికి. గోచీ గుడ్డను రక్షించుకోవడానికి జరిగిన సన్యాసి పరిణామక్రమ సిద్ధాంతమిది.

ఇప్పుడు ఈ కథను ప్రస్తుతానికి అన్వయించుకోండి. గోచీ గుడ్డ, ఎలుక, పిల్లి, కుక్క, ఆవు, పందిరి, పరిజనం, భజన, పరవశం, సన్యాసి సంసారం.. సభామర్యాద దృష్ట్యా చెప్పకూడని ఇంకా ఎన్నెన్నో విషయాల్లో అన్నీ “కౌపీన సంరక్షణార్థం” సందర్భాలే. అవే పాత్రలు. అవే ఘటనలు. అవే దిగజారుళ్ళు. అంతా సేమ్ టు సేమ్. జస్ట్ నేమ్స్ ఛేంజ్డ్.

మనం సంసారులుగా అష్టకష్టాలు పడుతూ.. వాటినుండి విముక్తికి బాబాలు, స్వాములు, పీఠాలు, ఆశ్రమాలు అనుకుంటూ వెళతాము కానీ.. సన్యాసి స్వాముల కష్టాలు పగవారికి కూడా వద్దు. ఆశ్రమాల్లో జరిగే రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, పై ఎత్తుల ముందు బయట జరిగేవి సముద్రంలో కాకి రెట్టంత కూడా ఉండవు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వార్గాలను(ఆరుగురు శత్రువులను) జయించడమెలాగో ప్రవచనాలు చెబుతూ…స్వాములు వాటితోనే యుద్ధం చేస్తూ ఉంటారు. కోటికొక్కరిని తప్ప మిగతా స్వాములందరినీ ఆ అరిషడ్వార్గాలు ఎప్పుడూ జయిస్తూనే ఉంటాయి. “ఓహో! ఇలా అరిషడ్వార్గాల మాయలో చిక్కుకోకూడదన్న మాట” అని ఎందరో స్వాములు మనకు నడిచే ఉదాహరణలుగా మిగులుతూ ఉంటారు.

కర్ణాటకలో మఠాల, పీఠాధిపతుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఒక్కో కులానికి ఒక్కో పీఠం, కొన్ని కులాలకు లెక్కలేనన్ని పీఠాలు. ఆధ్యాత్మిక విషయాలకే పరిమితమయ్యే పీఠాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. మిగతావన్నీ నిత్యం ఇతరేతర వ్యాపారాల్లో మునిగి తేలుతూ ఉంటాయి. రాజకీయం మొత్తం ఈ పీఠాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డి కె శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని కొందరు పీఠాధిపతులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలోనే బల్లగుద్ది మరీ డిమాండ్ చేశారు.

స్వతహాగా సిద్ధరామయ్య నాస్తికుడు. అల్ప సంఖ్యాక ప్లస్ హిందూ ప్లస్ దళిత కలగలుపులో మొదటి అక్షరాలను తీసుకుని “అహింద” అన్న భావననే తయారు చేసి కర్ణాటకలో తనదైన ముద్ర వేశారు. కాషాయం స్వాములు ఎంతగా బల్లలు గుద్దినా…తన కుర్చీని ఎలా కాపాడుకోవాలో తెలియని అమాయకుడు కాదు. డి కె ను సమర్థించే సన్యాసుల వాణికి కౌంటర్ గా మైనారిటీ, ఎస్ సి , ఎస్ టీ , ఓ బి సి రాష్ట్ర నాయకులను తెరమీదికి తెచ్చారు. సిద్ధరామయ్యను మారిస్తే రాష్ట్రమంతా స్తంభింపచేస్తామంటూ బహిరంగంగా వారు హెచ్చరికలు జారీ చేశారు.

శాస్త్రం ఆగిన చోటే మతం మొదలు కావాలి. రాజకీయం ఆగిన చోటే పీఠాలు మొదలు కావాలి అని డి కె శివకుమార్ స్వాములను ప్రవేశపెట్టినట్లున్నారు. కర్ణాటక రాజకీయాల్లో డి కె అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. సంపన్నుడు. కార్యదక్షుడు. దక్షిణ భారతంలో కాంగ్రెస్ కు క్రైసిస్ మేనేజర్. కానీ సిద్ధరామయ్యను పక్కకు నెట్టి ఆ స్థానంలో ఎలా కూర్చోవాలో! అంతుబట్టడం లేదు.

స్వాములు బహిరంగంగా ఇలా రాజకీయ కార్యకలాపాల్లోకి దిగడాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన పనిలేదు. చాటు మాటుగా రోజూ ఈ పనులే చేస్తూ.. చిల్లర పోగేసుకునే స్వాములతో పోలిస్తే.. వీరు నయం.

ఏమి! సన్యాసులు మనుషులు కారా?
వారికి రాజకీయ అభిప్రాయాలుండవా?

నిజమే. సామెతలు ఊరికే పుట్టవు.
గోచీ గుడ్డను రక్షించుకోవడం దగ్గర మొదలైన సన్యాసుల అస్తిత్వ పోరాటం ముఖ్యమంత్రులను మార్చడం దాకా.. వ్యవస్థలను ఏమార్చడం దాకా సాగాల్సిందే. అలాగే సాగుతోంది.

ఇదొక సన్యాసి పరిణామక్రమ సంసార గతితార్కిక నయా కౌపీన సంరక్షణార్థ రివిజనిస్ట్ సిద్ధాంతం!

కొస మెలిక:-
దేవుడే దిగివచ్చినా కర్ణాటక కుర్చీ చిక్కుముళ్లు విప్పగలడో! లేడో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్