Sunday, September 8, 2024
HomeTrending Newsఏప్రిల్ 5న ఒంటిమిట్టకు సిఎం జగన్

ఏప్రిల్ 5న ఒంటిమిట్టకు సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 5న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో  తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహించే సీతారామ కల్యాణంలో సిఎం పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి నేడు పరిశీలించారు.

కల్యాణానికి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని ధర్మారెడ్డి తెలిపారు. కల్యాణం రోజున భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను వైఎస్సార్ జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో కలిసి నేడు పరిశీలించారు. విభాగాల వారీగా జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. కల్యాణవేదిక వద్ద భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే ముందే ముత్యంతో కూడిన తలంబ్రాలు, పసుపుకుంకుమ, అన్నప్రసాదం ప్యాకెట్ అందిస్తామని, భక్తులు ఎలాంటి తొందరపాటు లేకుండా వీటిని స్వీకరించి సంతృప్తికరంగా కల్యాణాన్ని దర్శించాలని కోరారు. భక్తుల కోసం తగినన్ని మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు  అందుబాటులో ఉంచుతామన్నారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆలయ పరిపాలన భవనం వద్ద గల విశ్రాంతి గృహం, ఆలయం, పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక వద్ద చేపట్టిన ఏర్పాట్లను ధర్మారెడ్డి స్వయంగా పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్