Sunday, September 22, 2024
HomeTrending Newsవ్యవసాయంపై ప్రభుత్వాల దృక్పధం మారాలి - మంత్రి నిరంజన్ రెడ్డి

వ్యవసాయంపై ప్రభుత్వాల దృక్పధం మారాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

వ్యవసాయంపై ప్రభుత్వాల దృక్పధం మారాలని, ప్రపంచానికి అవసరమైన ఆహారం రావాల్సింది వ్యవసాయం నుండే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయం సుస్థిరం, సమర్దవంతం కావాలంటే నాణ్యమైన విత్తనమే ప్రధానమన్నారు. హైదరాబాద్ నోవాటెల్ లో తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విత్తన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ పంట రకాలను విస్తరించడానికి పరిశోధనలు ముఖ్యం అన్నారు. దేశంలో దాదాపు 71 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అనేక ప్రైవేటు పరిశోధనా సంస్థలు ఉన్నాయని, పరిశోధనలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో జరుగుతున్నవి .. అవి మరింత సమన్వయంతో జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు.

విత్తన పరిశోధన ప్రైవేటు రంగంలో ఎక్కువగా జరుగుతున్నదని మంత్రి తెలిపారు. ఆహారానికి ప్రత్యామ్నాయం లేదని, ప్రపంచ జనాభాకు అవసరమైన ఆహారం అందించడం ప్రథమ కర్తవ్యమన్నారు. నాణ్యమైన పోషకాహారంపై దృష్టిపెట్టాలని, నాణ్యమైన పోషకాహారం అందించడంలో ప్రపంచం ముందు అనేక సవాళ్లు ఉన్నాయని వివరించారు. 2015లో జరిగిన ఐక్యరాజ్యసమితి జెనీవా సదస్సులో 17 అంశాలలో ప్రపంచం ముందు ఉంచి ప్రపంచ దేశాలు వాటిపై దృష్టి పెట్టాలని సూచించిందన్నారు. నాణ్యమైన ఆహారం అందించాలంటే నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయడం మన ప్రధాన విధి అని, ప్రపంచంలో భారతదేశం నాణ్యమైన విత్తన ఉత్పత్తి దారుల్లో ముందున్నది .. అందులో తెలంగాణ రాష్ట్రం మరింత ముందున్నదని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి నకిలీ విత్తనాలు పెద్ద సమస్య అని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో తొలిసారి పీడీ యాక్ట్ ప్రవేశపెట్టారు .. దేశంలో నకిలీ విత్తన విక్రేతలపై పీడి యాక్ట్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే తరాలకు విత్తన పరిశ్రమ ఉత్తమ ఫలితాలను అందించాల్సిన ఆవశ్యకత ఉన్నదని, వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం దేశంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు రావాలని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విత్తన సదస్సుకు హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి ఎస్ కె పట్నాయక్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఐకార్ సీడ్స్ డీజీ డాక్టర్ డీకే యాదవ, తెలంగాణ సీడ్స్ ఎండీ కేశవులు, NSAI ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, ఇస్టా వైస్ ప్రెసిడెంట్ ఎర్నెస్ట్ అల్లెన్, జీఎఫ్ఎ General Agent Of Belateral CoOparation Programme Of BMEL ఉల్రెక్ మిల్లర్, FSII వైస్ ప్రెసిడెంట్ పరేశ్ వర్మ, కేంద్ర ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ కమీషనర్ దిలీప్ కుమార్ శ్రీవాస్తవ తదితరులు ఉన్నారు.

Also Read : ఉద్యానవన పంటల సాగులో తెలంగాణ టాప్ నిరంజన్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్