Monday, March 16, 2026
HomeTrending NewsPanchayathraj: కొత్త చట్టంతో పల్లెల వికాసం - మంత్రి వేముల

Panchayathraj: కొత్త చట్టంతో పల్లెల వికాసం – మంత్రి వేముల

నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 60 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం మోర్తాడ్ లోని రైతు వేదిక కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో చేపట్టిన మార్పులతో తెలంగాణ పల్లెలు సర్వతో ముఖాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయన్నారు. గ్రామ పంచాయతీలను వికేంద్రీకరిస్తూ జవాబుదారీతనం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందన్నారు.

దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తూ తెచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామాలన్నీ వికాసాన్ని సంతరించుకొని యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రతి పల్లెలో పచ్చదనం పెరిగి, ఇంటింటికి తడి పొడి చెత్త సేకరణ, కంపోస్టు షెడ్లు వంటి వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. గడిచిన యాభై సంవత్సరాలలో జరగని అభివృద్ధి, నూతన పంచాయతీరాజ్ చట్టంతో స్వల్ప కాలంలోనే సాధ్యపడిందని మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు వరించిన అవార్డులే ఇందుకు నిదర్శనం అని అన్నారు.

తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతోనే పల్లెలు ప్రగతి దిశగా పయనిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధిని సంతరించుకుంటున్నాయని స్వయంగా నీతి ఆయోగ్ వెల్లడించడం తార్కాణం అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పంచాయతీ కార్యదర్శుల కృషి, పట్టుదలతోనే పల్లెల వికాసం సాధ్యపడిందని, ఈ దిశగా స్ధానిక ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో తోడ్పాటును అందించారని అభినందించారు. ప్రస్తుతం నాలుగేళ్ళ సర్వీస్ ను పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ, గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియమించిన నేపథ్యంలో పల్లెల అభ్యున్నతి కోసం మరింత అంకిత భావంతో పని చేయాలని సూచించారు. నిస్వార్థంతో, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలందిస్తే, మంచి గుర్తింపు లభించడమే కాకుండా ఎంతో సంతృప్తి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పిటిసి రవి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, డీఎల్పీఓ శ్రీనివాస్, సర్పంచ్ భోగ ధరణి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular