హీరోగా సిద్ధార్థ్ కి తెలుగులో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. అప్పట్లో యూత్ లో చాలామంది ఆయన అభిమానులే. కాలేజ్ స్టూడెంట్స్ లో చాలామంది ఆయన అభిమానులు ఉండేవారు. తెలుగు నుంచి సిద్ధార్థ్ చెప్పుకోదగిన సినిమాలనే ఇచ్చాడు. అయితే ఆ తరువాత కాలంలో కొత్త నీరు రావడం వలన .. ఆయనకి పరాజయాలు పెరగడం వలన సహజంగానే వెనకబడ్డాడు. అయితే ఆయన తమిళంలో చేసిన సినిమాలు అడపా దడపా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి.
అలా ఆయన నుంచి ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘చిన్నా’ సినిమా రెడీ అవుతోంది. తమిళంలో ఆయన చేసిన ‘చిత్తా’ సినిమాకి ఇది అనువాదం. తమిళంలో క్రితం నెల 28వ తేదీన విడుదలైన ఆ సినిమాకి అక్కడ మంచి టాక్ వచ్చింది. దాంతో ఆయన ఆ సినిమాను ఇక్కడ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఈవెంటులో సిద్ధార్థ్ కాస్త ఎమోషనల్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ చాలా యాక్టివ్ గా కనిపించే సిద్ధార్థ్ అలా ఎమోషనల్ అవుతాడనని ఎవరూ ఊహించలేదు.
తాను చేసిన ‘చిన్నా’ చూసి తమిళనాడు .. కేరళ .. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్నారనీ, తెలుగు దగ్గరికి వచ్చేసరికి ‘సిద్ధార్థ్ సినిమానా? ఎవరు చూస్తారు?’ అని అడిగారంటూ ఆయన ఎమోషనల్ అయ్యాడు. దుఃఖాన్ని దిగమింగుకోవడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు. ఏషియన్ సునీల్ గారు ముందుకు రావడం వలన ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేయగలుగుతున్నామని అన్నాడు. ‘చిన్నా’ చూసిన తరువాత కూడా తనపై ఆడియన్స్ అభిప్రాయం మారకపోతే, ఇక తాను ఇటు వైపు రానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.