Friday, June 12, 2026
HomeTrending Newsఆ శిథిలాలు అలాగే ఉంచుతాం: చంద్రబాబు

ఆ శిథిలాలు అలాగే ఉంచుతాం: చంద్రబాబు

గత ప్రభుత్వ విధ్వంస పాలనకు ప్రతీకగా ప్రజావేదిక శిథిలాలను యథాతథంగా ఉంచుతామని, వాటిని తొలగించడం గానీ, దాని స్థానంలో మరొక వేదిక నిర్మించడం గానీ చేయబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నిన్న మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ చేశారు.

సీఎం చంద్రబాబుని కలిసేందుకు పార్టీ కార్యాలయానికి భారీగా టీడీపీ కార్యకర్తలు వచ్చారు. వారిని నియంత్రించేందుకు కార్యాలయంలో బార్కేడింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు… ఇకపై అలా చేయవద్దని పోలీసులను ఆదేశించారు.  తనకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని, ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని చిట్ చాట్ లో ప్రస్తావిస్తూ ప్రజావేదిక ఉండి ఉంటే వినతులు స్వీకరణకు అనువుగా ఉండేదని కానీ గత ప్రభుత్వం దాన్ని కూల్చి వేసిందని ఆవేదన వెలిబుచ్చారు. సెక్యూరిటీ నిబంధనలు పాటిస్తూనే సాధ్యమైనంతగా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.

ప్రజా వేదిక ప్రాంతాన్ని ఏం చేస్తారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా….వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధ్వంస పాలనకు ప్రతీకగా దాన్ని అలాగే ఉంచుతామని, ఆ శిథిలాలను తొలగించమని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని, నష్టాన్ని కూల్చివేయబడిన ఆ ప్రజావేదిక ఎప్పటికీ చాటి చెపుతుందని సిఎం అన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన మొదలైంది ప్రజావేదిక కూల్చివేత ద్వారానే కాబట్టి…దాన్ని ఒక చిహ్నంగా ఉంచుతామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular