ప్రపంచం ఇప్పుడు ఒక వింతైన యుద్ధం చేస్తోంది. అది ఆయుధాల యుద్ధం కాదు, అణుబాంబుల కొట్లాట కాదు.. అది ‘నీటి’ యుద్ధం. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. నదులు కలుషితమై హారతులు అందుకుంటున్నాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం దాదాపు 220 కోట్ల మందికి సురక్షితమైన తాగునీరు అందడం లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, “ఆకాశం నుంచి వర్షం కురవక్కర్లేదు.. గాలి ఉంటే చాలు గంగమ్మను రప్పిస్తాను” అంటూ ఒక శాస్త్రవేత్త చేసిన ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయనే నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ఒమర్ యాగీ.
శరణార్థి శిబిరం నుంచి నోబెల్ వేదిక వరకు
ఏ ఆవిష్కరణ వెనుకైనా ఒక బలమైన వేదన ఉంటుంది. ప్రొఫెసర్ యాగీ పుట్టి పెరిగింది జోర్డాన్లోని శరణార్థి శిబిరాల్లో. అక్కడ నీటి కోసం జనం పడే తపన, చుక్క నీటి కోసం గంటల కొద్దీ వేచి చూసే దీనస్థితిని ఆయన కళ్లారా చూశారు. ఆ దాహమే ఆయనను రసాయన శాస్త్రం వైపు మళ్లించింది. 2025లో ఆయనకు లభించిన నోబెల్ బహుమతి కేవలం ఒక పురస్కారం కాదు, అది కోట్లాది మంది దాహార్తిని తీర్చగల ఒక మహత్తర ఆశయం.

రెటిక్యులర్ కెమిస్ట్రీ మాయాజాలం
సాధారణంగా గాలి నుంచి నీటిని తీయడం (Atmospheric Water Generation) కొత్తేమీ కాదు. కానీ ఇప్పటి వరకు ఉన్న పద్ధతులు చాలా ఖరీదైనవి. గాలిని విపరీతంగా చల్లబరచడానికి భారీగా విద్యుత్ అవసరమయ్యేది. కానీ యాగీ రూపొందించిన MOF (Metal-Organic Frameworks) టెక్నాలజీ ఒక విప్లవం.
- రసాయనిక అయస్కాంతాలు: ఈ MOFలు గాలిలోని నీటి అణువులను స్పాంజీలా పీల్చుకుంటాయి.
- ఎడారిలోనూ అద్భుతం: సాధారణ యంత్రాలు గాలిలో 45% తేమ ఉంటేనే పనిచేస్తాయి. కానీ యాగీ యంత్రం కేవలం 10% తేమ ఉన్న ఎడారి ప్రాంతాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
- విద్యుత్ రహితం: దీనికి భారీ మోటార్లు అక్కర్లేదు. సూర్యరశ్మి ఇచ్చే కొద్దిపాటి వేడితోనే పీల్చుకున్న తేమను స్వచ్ఛమైన నీరుగా మార్చవచ్చు. ఒక షిప్పింగ్ కంటైనర్ పరిమాణంలో ఉండే ఈ యంత్రం రోజుకు 1,000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేయడం సామాన్యమైన విషయం కాదు.
భారత్ ముంగిట జల విప్లవం
మన దేశంలో కూడా ‘అక్వో’ (Akvo) వంటి సంస్థలు గాలి నుంచి నీటిని తీసే దిశగా అడుగులు వేశాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్లోని మారుమూల గ్రామాల్లో ఇవి ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. అయితే, యాగీ కనిపెట్టిన MOF సాంకేతికత అందుబాటులోకి వస్తే, భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. నీటి ట్యాంకర్ల మీద, అడుగంటిపోతున్న బోరు బావుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

సవాళ్లు, భవిష్యత్తు
ఏ కొత్త సాంకేతికతకైనా ప్రారంభంలో ఖర్చు ఒక సవాలే. ఈ MOF యంత్రాలను భారీ స్థాయిలో తయారు చేసి, సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడమే ఇప్పుడున్న అసలైన లక్ష్యం. “గాలిలోని నీటి పరిమాణం ప్రపంచంలోని అన్ని నదుల్లో ఉన్న నీటి కంటే ఆరు రెట్లు ఎక్కువ” అన్నది వాస్తవం. ఈ అపారమైన జలనిధిని మనం ఒడిసిపట్టుకోగలిగితే, రాబోయే తరాలకు మనం తగినంత నీటిని ఆస్తిగా ఇవ్వచ్చు.
మట్టి నుంచి గంగ రావడం పాత మాట. గాలి నుంచి గంగమ్మను రప్పించడం నేటి బాట. ప్రొఫెసర్ యాగీ ఆవిష్కరణ కేవలం ఒక ప్రయోగం కాదు, అది మానవాళి మనుగడకు ఒక భరోసా.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

