Friday, March 13, 2026
Homeతెలంగాణచిరస్మరణీయుడు కల్నల్ సంతోష్ బాబు  - మంత్రి కేటీఆర్

చిరస్మరణీయుడు కల్నల్ సంతోష్ బాబు  – మంత్రి కేటీఆర్

కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కలువకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. జాతి ఉన్నంత కాలం ఆయన పేరు చరిత్రపుటల్లో ఉంటుందని ఆయన కొనియాడారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి తో కలసి ఈ రోజు ఆవిష్కరించారు.

కల్నల్ సంతోష్ బాబు మరణానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయ సందేశం యావత్ భారతదేశానికి స్ఫూర్తివంతమైన సందేశాన్ని చేర వేసినట్లైందని కేటిఆర్ పేర్కొన్నారు. భారత్ -చైనా సరిహద్దుల్లో కల్నల్ సంతోష్ బాబు త్యాగానికి ఏమిచ్చినా సరిపోదని మంత్రి ప్రశంసించారు. కల్నల్ సంతోష్ బాబు జాతి ఉన్నంత కాలం ప్రజల మనసులో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారన్నారు.

అటువంటి మహనీయుడు ప్రాణ త్యాగం చేసింది మొదలు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు సహచర మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్ ప్రశంశించారు. మంత్రులుగా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటున్నా కల్నల్ సంతోష్ బాబు విగ్రహ ఆవిష్కరణ తన చేతుల మీదుగా జరగడం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. విగ్రహాన్ని రూపొందించిన శిల్పి శ్రీనివాస రెడ్డి ని మంత్రి కేటీఆర్ అభినందిస్తూ ఈ సందర్భంగా ఆయనను శాలువతో ప్రత్యేకంగా సత్కరించారు.

చనిపోయి కుడా జాతి ఉన్నంత కాలం పేరు నిలబడడం కొందరికే వర్తిస్తుందని అందులో దివంగత సంతోష్ బాబు పేరు ఉండడం ఆయన అదృష్టమని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జాతి జీవించి ఉన్నంత కాలం వర్తమానానికి స్ఫూర్తినిచ్చే రీతిలో కల్నల్ సంతోష్ బాబు పేరు నిలిచిపోతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులతో పాటు శాసనసభ్యులు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular