Friday, March 13, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్విశాఖ భూకబ్జాలపై విచారణ: సోము డిమాండ్

విశాఖ భూకబ్జాలపై విచారణ: సోము డిమాండ్

జగన్ పాలన అంటే కానుకలు ఇవ్వడం- అప్పులు తేవడంలాగా ఉందని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపాలన చూడలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కొత్త అప్పుల కోసం విశాఖను తాకట్టుపెడుతున్నారని, విశాఖ నగరంలో భూకబ్జాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ భూ ఆక్రమణల్లో అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారని సోము ఆరోపించారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కలెక్టరేట్ ను కూడా అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం నియంత్రించలేక పోతోందని సోము వీర్రాజు విమర్శించారు.. విశాఖపట్టణంలో బిజెపి కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడారు.

ప్రజలకు సుపరిపాలన అందించడంలో వైసీపీ విఫలమైదని, పాలన అపసవ్య దిశలో సాగుతోందని ఆక్షేపించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ పై బిజెపి యువమోర్చా అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని, దాని బదులు అబ్దుల్ కలాం విగ్రహం పెట్టాలని సూచించారు. ఈ విషయంలో అధికార పార్టీ పట్టుదలకు పొతే గట్టిగా వ్యతిరేకిస్తామన్నారు.

అశోక్ గజపతి రాజుపై విమర్శలు చేసే స్థాయి వైసిపి నేతలకు లేదని సోము అన్నారు. వారి కుటుంబం అనేక ధార్మిక కాయక్రమాలు, దానధర్మాలు చేసిందని గుర్తు చేశారు. అశోక్ గజపతి ఎన్నో పదవులు నిర్వహించినా ఎంతో సాధారణ జీవితం గడుపుతున్నారని, అలాంటి వ్యక్తిని దొంగ అని ఒక మంత్రి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు సభ్యత పాటించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular