మంత్రివర్గ సహచరులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రులు సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని సిఎం అసహనం వ్యక్తం చేశారని సమాచారం. నేడు సచివాలయంలో సిఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. రెగ్యులర్ బిజినెస్ పూర్తయిన తర్వాత సి మంత్రులతో సిఎం ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రభుత్వంపై, ముఖ్యంగా తన కుటుంబ సభ్యులపై విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నా వాటిని ఖండించడంలో మంత్రులు చొరవ చూపించడం లేదని సిఎం ఆగ్రహం ప్రదర్శించారని తెలిసింది.
ఓ దశలో కొందరు మంత్రులు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు సిఎం ఒకింత కరుకుగానే మాట్లాడారట. ‘నా కుటుంబసభ్యులపై ఆరోపణలు చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు.. నిత్యం వాళ్ళు బురద జల్లుతున్నా పట్టించుకోరా?’ అని ప్రశ్నించారు, మంత్రుల తీరు ఇలాగే ఉంటే మరోసారి కేబినేట్ లో మార్పులు చేయాల్సి వస్తుందని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది.
Also Read : ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు: సిఎం జగన్