Friday, June 12, 2026
HomeTrending Newsకొత్త వైద్య కళాశాలల్లో నేటి నుంచి బోధన

కొత్త వైద్య కళాశాలల్లో నేటి నుంచి బోధన

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీలను ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించబోతున్నట్లు ప్రగతిభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది 8 కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కళాశాలల్లో ఈ నెల 15 నుంచి వైద్య విద్య తరగతులు ప్రారంభంకాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త కాలేజీలను ఆన్‌లైన్‌ ద్వారా సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి ప్రారంభించబోతున్నారని అధికారవర్గాలు తెలిపాయి.  సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జగిత్యాల, రామగుండం, మంచిర్యాలలో ప్రభుత్వం కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఒకే ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 8 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

ఈ కాలేజీల్లో ఒక్క మంచిర్యాలలో (100సీట్లు) మినహా మిగిలిన ఏడింటిలో 150 సీట్ల చొప్పున ప్రారంభించేందుకు జాతీయ వైద్య కమిషన్‌ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది సర్కారీ వైద్య విద్య కళాశాలల్లో అదనంగా 1150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కాగా జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ ఆయా జిల్లాలకు వెళ్లనున్నారు. ఇదే సమయంలోనే ఈ మెడికల్‌ కాలేజీలను కూడా ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ ఇంత పెద్ద విజయాన్ని (ఒకేసారి 8 కాలేజీల మంజూరు) భారీ స్థాయిలో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నెల 15న వాటిని ఆన్‌లైన్‌లో ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు వెల్లడించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular