పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, పన్ను చెల్లింపుదారులకు వాణిజ్య పన్నులశాఖ అధికారులు మరింత అవగాహన కలిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని పన్నులు కట్టే వారికి స్పష్టం చేయాలని, అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆదాయాలను ఇచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సిఎం జగన్ తొలుత వాణిజ్య పన్నులశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. పన్నులపై అవగాహన పెంచడం, వారి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందించినట్టు అవుతుందని పేర్కొన్నారు.
ఎక్సైజ్ శాఖపై సమీక్షిస్తూ… గతంతో పోల్చి చూస్తే… మద్యం అమ్మకాలు తగ్గాయని, బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్ రూమ్లు రద్దు వంటి ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని, రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందని వ్యాఖ్యానించారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పరివర్తన కార్యక్రమంపై అడిగి తెలుసుకున్న సిఎం… చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలు ద్వారా వారికి ఊతమివ్వాలనన్నారు. గంజాయి, అక్రమ మద్యం కేసులుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు చేపడుతూనే, ఉపాధి కల్పనకు కూడా కృషి చేయాలన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖపై సిఎం సమీక్షిస్తూ…. శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాల్లో.. వార్డుల్లో…సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలని సిఎం నిర్దేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్ అందించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో…ఏయే రకాల డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న విషయాలపై ప్రజలకూ అర్ధమయ్యేలా వివరించాలన్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాను అప్గ్రేడ్ చేయాలని సూరించారు.
మైనింగ్ శాఖపై కూడా సిఎం సమీక్షిస్తూ నాన్ ఆపరేషనల్ మైన్స్పై మరింత దృష్టి పెట్టాలన్నారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని అధికారులకు కర్తవ్య బోధ చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, స్టేట్ టాక్సెస్ చీప్ కమిషనర్ గిరిజా శంకర్, సీఐడీ ఏడీజీ పి వి సునీల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.