Saturday, March 14, 2026
HomeTrending Newsవైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు

వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ పాలకులను టెర్రరిస్టులు అంటూ.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విధ్వేషాలు రగిల్చేలా మాట్లాడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదును అందజేశారు. షర్మిలపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. టీవీ9 తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన షర్మిల… తెలంగాణ వస్తే వీసా తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రా ప్రాంతంలో మాట్లాడిన మాటలను ప్రస్తావించగా.. “తెలంగాణను ఈ ఉగ్రవాదుల చేతుల్లో పెట్టకూడదనే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు..” అంటూ ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలను, ఉద్యమకారులను ఉగ్రవాదులతో పోల్చి అవమానించారని మండిపడ్డారు. ప్రపంచచరిత్రలో నిలిచిపోయేలా శాంతియుతంగా చేసిన ఉద్యమాన్ని షర్మిల ఉగ్రవాదంతో పోల్చడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. వైఎస్.షర్మిల మరో మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలంగాణను ఆఫ్గనిస్తాన్ అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ని తాలిబాన్ నాయకుడని మాట్లాడటంపై వై.సతీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

గతంలో షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన సమయంలో తెలంగాణను పాకిస్తాన్ అంటూ సంభోదించారని మండిపడ్డారు. ఏపీలో ఉండి తెలంగాణపై విషం చిమ్మిన షర్మిల ఇప్పుడు తెలంగాణపై ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నారన్నారు. తన రాజకీయపబ్బం గడుపుకోవడానికి, అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీతో మిలాఖత్ అయ్యి.. తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. షర్మిల ఎంత ప్రేమ నటించినా… తెలంగాణపై ఆమె మనసులో ఉన్నది మాత్రం విషమేనని ప్రజలందరికి తెలిసిపోయిందన్నారు. అందుకే ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టిందని ఫైరయ్యారు.
ఇక.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు.. వైఎస్.షర్మిలకు అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణను ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ తో పోల్చిన షర్మిలకు గవర్నర్ అపాయింట్ ఎలా ఇస్తారని, ఆమెపై ఎందుకు అంతగా సానుభూతి చూపిస్తున్నారని ప్రశ్నించారు. తమిళిసై.. తెలంగాణకు గవర్నరా..? ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ కు గవర్నరా..? చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ సాధన ఉద్యమాన్ని, ఇక్కడి ప్రజలను అవమానించిన వ్యక్తికి గవర్నర్ ఎలా అపాయింట్ మెంట్ ఇస్తారని ప్రశ్నించారు. గవర్నర్ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా..? లేకపోతే బీజేపీ దానికి అనుకూలంగా, అనుబంధంగా పనిచేస్తున్న ఇతర పార్టీల కోసం పనిచేస్తున్నారో చెప్పాలన్నారు.

Also Read : షర్మిల వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular