Friday, September 20, 2024
HomeTrending Newsకేంద్రం తీరుతో రైతులకి ఖర్చు రెండింతలు: మంత్రి హరీశ్‌

కేంద్రం తీరుతో రైతులకి ఖర్చు రెండింతలు: మంత్రి హరీశ్‌

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అడుగడుగునా వివక్షకు గురైందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌లో పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. గత పాలకులకు.. ప్రస్తుతం కేసీఆర్‌కు చాలా తేడా ఉందని తెలిపారు. తెలంగాణలో పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయన్నారు. బడ్జెట్‌లో ఎక్కువశాతం బడుగు, బలహీన వర్గాలకు కేటాయింపులు జరిగాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై సాధారణ చర్చకు ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు సమాధానమిచ్చారు. కంటివెలుగును ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ప్రారంభిస్తామన్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుంటున్నదన్నారు. రాష్ట్రంలో భూమికి బరువయ్యే పంట పండుతున్నదని చెప్పారు. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని చెప్పారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పని కోసం తెలంగాణకు వలస వస్తున్నారని వెల్లడించారు. వరి నాట్లు వేసేందుకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి, పత్తి ఏరడానికి కర్ణాటక, హమాలీ పనికోసం బీహార్‌, మిర్చీ ఏరేందుకు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు కూలీలు వస్తున్నారని చెప్పారు. దేశంలో కేవలం 49 శాతం మంది ప్రజలకు శుద్ధిజలం అందుతున్నదని చెప్పారు. తెలంగాణలో మాత్రం ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. మిషన్‌ భగీరథతో చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ కృషివల్లే ఇన్ని విజయాలు సాధ్యమయ్యాయని వెల్లడించారు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని చెప్పారు.

కేంద్ర బడ్జెట్‌లో కోతలు తప్పమరేమీ లేవని మంత్రి అన్నారు. అందులో రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని విమర్శించారు. పత్తి రైతులకు కేంద్రం ఏ చెప్పాలనుకుంటున్నదని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర విషయంలో మొండిచేయి చూపిందన్నారు. రైతులపట్ల కేంద్రం కక్షగట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ.. ఖర్చు మాత్రం రెండింతలయిందని విమర్శించారు. రైతులకు కోతలు పెట్టి.. కార్పొరేట్లకు దోచిపెట్టారన్నారు. మోదీ సర్కార్‌ కార్పొరేట్‌ కంపెనీలకు రూ.13,34,304 కోట్లు మాఫీ చేసిందన్నారు.

Also Read : జాతీయ రాజకీయాలకు మలుపు ఈ సభ : హరీష్ రావు

RELATED ARTICLES

Most Popular

న్యూస్