గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ యువ గళం పాదయాత్ర కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కొనసాగుతోంది. పెద్ద తుంబలంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు సర్పంచ్ లు లోకేష్ దృష్టికి తీసుకు వెళ్ళారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి జరిగితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని లోకేష్ పేర్కొన్నారు. “ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలు నిధులు లేక అల్లాడిపోతున్నాయి. సర్పంచ్, పంచాయతీ రాజ్ కార్యదర్శి సంతకాలు లేకుండానే గ్రామ పంచాయతీ అకౌంట్లోని డబ్బులు మాయమైపోతున్నాయి. పల్లెల అభివృద్ధి ఇంకెలా జరుగుతుంది? ఈ దుస్థితి పోవాలంటే తెలుగుదేశం రావాలి” అని అభిప్రాయపడ్డారు.
జగన్ అధికారంలోకి వచ్చాక పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడిందని, వైసీపీకి చెందిన సర్పంచ్ లే ప్రభుత్వంపై తిరగబడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే, గ్రామ సచివాలయం, పంచాయతీలు, సర్పంచ్ లను ఈ ప్రభుత్వం విభాజించిందని ఆరోపించారు. కానీ ఈ అన్ని వ్యవస్థలూ సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించారని, వైసీపీ సర్పంచ్ ప్రకాష్ ఇదే విషయమై చెప్పుతో కొట్టుకున్నారని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకువస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.