Saturday, March 14, 2026
HomeTrending NewsYS Jagan: ఎవరి డ్రామా వారు ఆడుతున్నారు: జగన్

YS Jagan: ఎవరి డ్రామా వారు ఆడుతున్నారు: జగన్

తన పరిపాలనా కాలంలో రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతిస్తున్న దత్తపుత్రుడు ఇప్పుడు రైతు బంధవుల వేషం వేసుకుని తిరుగుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. వీరు, వీరికి మద్దతీస్తున్న మీడియా రామాయణంలో శూర్పణఖ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న బాబు ఒక వైపు…. బాబు రాసిన స్క్రిప్టు ప్రకారం డైలాగులు చెబుతూ, పొలిటికల్ యాక్షన్ చేస్తూ ప్యాకేజీ తీసుకొని నటించే ప్యాకేజీ స్టార్ మరో పక్క ఉన్నారని ధ్వజమెత్తారు. వీరి డ్రామాను రక్తి కట్టించడానికి ఎల్లో మీడియా ఉందన్నారు. ఎవరి డ్రామా వారు ఆడుతున్నారని, వీళ్ళ మాటలు నమ్మవద్దని సూచించారు.  రైతన్నల వెంట ప్రభుత్వం ఉంది  కాబట్టే వెంటనే ధాన్యం కొనుగోలు చేశామని, వారు దీన్ని తమ ఘనతగా చెప్పుకుంటున్నారని… వారు వస్తున్నారు కాబట్టే తాము కొనుగోలు చేసినట్లు మాట్లాడుతున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళు వచ్చినా, రాకపోయినా  నాలుగేళ్లపాటు ధాన్యం కొన్నది ఎవరని నిలదీశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా  కావలిలో చుక్కల భూముల పంపిణీ సందర్భంగా  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు.

రాత్రికి రాత్రే ఆర్ధిక వేత్తలు పుట్టుకొస్తున్నారని, ఇటీవలే జీవీ రావు అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆర్ధిక నిపుణుడిగా తయారు చేసి సంక్షేమ పథకాలతో ఆర్ధిక వ్యవస్థకు ముప్పు అంటూ చెప్పించారని ఈనాడు దినపత్రికను ఉద్దేశించి జగన్ ఎద్దేవా చేశారు.  ఇతనిపై ఆరా తీస్తే ఎప్పుడో ఇతని సీఏ లైసెన్స్ రద్దు అయ్యిందని, అలాంటి దానయ్యను పట్టుకొని… ఆయనకు ఓ కోటు తొడిగి సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని చెప్పించారని  మండిపడ్డారు. జీవీరావును జోకర్ గా సిఎం అభివర్ణించారు. చంద్రబాబు మనసులో మాటలే ఇలాంటి మేధావులతో చెప్పిస్తున్నారని, రామోజీరావు పురుగులు పట్టిన బుర్రలోనుంచి వీరందరూ పుడతారని ధ్వజమెత్తారు.

విద్య కోసం, మహిళా సాధికారత కోసం  తాము చేస్తున్న ఖర్చు హ్యూమన్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా చూడాలని… అంతేకానీ దాన్ని వృథా ఖర్చుగా చూడ కూడదని వ్యాఖ్యానించారు.  రాబోయే 15ఏళ్ళలో రాష్ట్రంలో ప్రతి పేదింటి పిల్లవాడు ఇంగ్లీష్ లోనే మాటాడే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఓటేస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని జగన్ హెచ్చరించారు. బాబుకు ఓటు వేయడమంటే స్కీములు ఆగిపోవడమే అర్ధం అని జగన్ అన్నారు.  ఏమాత్రం పొరపాటు జరిగినా ఏ పేదవాడూ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండబోదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular