Saturday, September 21, 2024
HomeTrending NewsTS Police: శాంతి భద్రతల్లో తెలంగాణ నెంబర్ వన్ - హోం మంత్రి

TS Police: శాంతి భద్రతల్లో తెలంగాణ నెంబర్ వన్ – హోం మంత్రి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన పోలీసు సామాజిక సమ్మేళనం కార్యక్రమం మేడిపల్లిలోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శ్రీమతి శాంతా కుమారి ఐఏఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరుపుకోవడం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి వంటిదన్నారు. అన్ని వర్గాల ప్రజల సమిష్టి పోరాటం, ఎన్నో వందల మంది అమరుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, తద్వారా రాష్టానికి పెట్టుబడులు వచ్చి ఎన్నో రంగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు.

2014 కు ముందు అభివృద్ధిలో అన్ని రకాలుగా వెనుకపడ్డ తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇపుడు బహుముఖ రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలను అదుపులో ఉంచడంతోనే అభివృద్ధి సాధ్యం అయిందని సిఎస్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా చెరువుల పండుగ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించబడుతుందని తెలిపారు.

హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణా పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. నగరంలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల ద్వారా నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. మహిళా భద్రత కోసం షి టీములు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్ల మీద, మెట్రో రైళ్ళలో, బస్టాండు వంటి ప్రయాణ ప్రదేశాల్లో, ఆకతాయిల నుండి ఎదురయ్యే వేధింపుల నుండి మహిళలకు రక్షణ ఇస్తున్నామన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, “గతంలో రాష్ట్రంలో బలంగా ఉన్న నక్సలిజం వల్ల ఎన్నో ఏళ్ళు ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరిగేవి కావు. మరెన్నో మంచి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు అందేవి కావు. దీని వల్ల రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత పోలీసు శాఖలో చేసిన మార్పులు, చేపట్టిన కార్యక్రామాల వల్ల శాంతి భద్రతలు మెరుగుపడి పెట్టుబడుల వెల్లువలా వస్తున్నాయి” అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు వల్ల ఎన్నో కొత్త కొత్త సాంకేతిక వనరులు, అధునాతన పెట్రోలింగ్ వాహనాలు పోలీసు శాఖలో ఏర్పాటు చేయబడ్డాయని, తెలిపారు. న్యూయార్క్ వంటి నగరంలో కనిపించే పోలీస్ పెట్రోలింగ్ స్థాయికి నగర పోలీసు వ్యవస్థ చేరుకుందని పేర్కొన్నారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా సాధించలేని అభివృద్ధి తెలంగాణ దశాబ్ద కాలంలోనే సాధించగలిగామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాల వల్ల మౌలిక వసతుల కల్పనతో పాటు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు అందాయని తెలిపారు.

డిజిపి అంజని కుమార్ ఐపిఎస్ మాట్లాడుతూ నేర నియంత్రణలో హైదరాబాద్ మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లతో సమానంగా రాచకొండ పోటీపడుతోందని అభినందించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని సిసిటివి కెమెరాలు అనుసంధానం చేయడబడతాయి, తద్వారా నేర పరిశోధన వేగవంతం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేర పరిశోధన వేగవంతం అయిందని, నేరశాతం కూడా తగ్గుముఖం పట్టిందని, పోలీసు శాఖలోని వివిధ విభాగాల సమన్వయంతో ఎటువంటి నేరం అయినా ఒకే రోజులో నేరస్తులను పట్టుకునే స్థాయికి రాష్ట్ర పోలీసు శాఖ చేరుకుందని పేర్కొన్నారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రపంచ స్థాయి కార్పోరేట్ కంపెనీలు, ప్రముఖ ఐటి కంపెనీలు పని చేస్తున్నాయని, వారి క్షేమం కోసం ఇరవై నాలుగు గంటలపాటు పోలీసు వారి పటిష్టమైన పెట్రోలింగ్ ద్వారా ఇక్కడ నేరాలు అదుపులో ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, తెలంగాణ మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ ఐఏఎస్, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, అడిషనల్ డీజీ జితేందర్ ఐపిఎస్, అడిషనల్ డీజీ సందీప్ శాండిల్య, సిఐడి అదనపు డిజిపి శ్రీ మహేష్ భగవత్ ఐపిఎస్, అడిషనల్ డీజీ శిఖాగోయల్ ఐపిఎస్, ఏడిజి ఉమెన్ సేఫ్టీ వింగ్, ఐజీ నాగిరెడ్డి ఐపిఎస్ ఫైర్ సర్వీసెస్, రమేష్ రెడ్డి ఐపిఎస్ ఐజి, నవీన్ మిట్టల్ ఐఏఎస్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఐపిఎస్, విజయ్ కుమార్ ఎడిజి, రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ ఐపిఎస్, డిసిపి జానకి ఐపిఎస్, డిసిపి సాయి శ్రీ ఐపిఎస్, అడ్మిన్ డిసిపి ఇందిర, డిసిపి మురళీధర్, డిసిపి మధుకర్ స్వామీ, అదనపు డిసిపి నర్మద, ఎసిపిలు ఇతర అధికారులు, కొల్లేటి దామోదర్, డైరెక్టర్, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్, మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్