Friday, September 20, 2024
HomeTrending NewsCongress: కేసీఆర్ కు చర్లపల్లిలొ డబుల్ బెడ్ రూమ్ - రేవంత్ రెడ్డి

Congress: కేసీఆర్ కు చర్లపల్లిలొ డబుల్ బెడ్ రూమ్ – రేవంత్ రెడ్డి

“తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తండ్రిని నమ్మడం లేదని కొడుకును పంపిస్తుండు. బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్.. కేసీఆర్ కొడుకు కేసీఆర్ లాగే మోసం చేస్తాడు తప్ప ప్రజల కోసం ఆలోచించరు..మూడోసారి ప్రజల్ని నట్టేట ముంచడానికి రెడీ అయ్యారు…మళ్లీ మోసపోవద్దు…తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తూముకుంట మునిసిపల్ కేంద్రంలో బీజేపీ, బీఆరెస్ నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

2001 కి ముందు కేసీఆర్ కు తొడుక్కోవడానికి చెప్పులు లేవు..ఇవాళ ఇన్ని లక్షల కోట్లు కేసీఆర్ కు ఎలా వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. పేదల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే మేము ఓట్లు అడుగుతాం.. ఎక్కడ మీరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారో అక్కడే మీరు ఓట్లు అడగండని సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నా.. మీ ఒంట్లో చీము, నెత్తురు ఉంటే.. మీరు మీసమున్న మగాళ్లు అయితే నా సవాల్ ను స్వీకరించండని పేర్కొన్నారు. ఏ నియోజకవర్గంలో మీకు డిపాజిట్లు రావు.. అయినా మీకు డిపాజిట్లు వస్తే మేము గుండు కొట్టించుకుంటామన్నారు రేవంత్.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో లక్ష్మాపూర్ లోని మూడు చింతలపల్లిలో కుమ్మరి ఎల్లవ్వ ఇంటికి వచ్చి చూస్తే.. మురికి నీరు అంతా ఆ ఇంట్లోకే వెళ్లేదన్నారు. ఆ తర్వాత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎల్లవ్వ ఇల్లు చూశా..రోడ్డు ఆరు ఫీట్లు ఎత్తు కట్టి ఎల్లవ్వ ఇల్లును ముంచేశారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడానికి మంచి దారి వేసుకున్నాడంటూ సెటైర్లు వేశారు రేవంత్. రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని ఎంపీగా కలెక్టర్ కు చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు రేవంత్. ఇక్కడి బీఆర్ఎస్ నాయకులకు భూ కబ్జాలు తప్ప.. పేదల బాధలు పట్టవు అంటూ ఆరోపించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రూ.5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం, రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి ఆదుకుంటామని పేర్కొన్నారు. అలాగే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తామని, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ నివాళిలో అడుగడుగునా కృత్రిమ భావన కనిపించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా చివరి రోజు అమరవీరుల సంస్మరణసభలో ఆ కుటుంబాలకు సత్కారాల నుండి ఎలక్ట్రానిక్ కొవ్వొత్తుల ప్రదర్శన వరకు నిజాయితీ కొరవడిందని రేవంత్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్