తెలంగాణ రాష్ట్రంలో 24 శాతం లోటు వర్షపాతం ఉన్నట్టు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఒక్క జిల్లాలోనూ అధిక వర్షపాతం లేదని, 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉండగా.. 22 జిల్లాల్లో సగటు కంటే తక్కువే నమోదైనట్టు వెల్లడించింది. ఏటా జూన్ 1 నుంచి జులై 13 వరకు సగటున 206.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ వానాకాలం సీజన్లో 156.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందని తెలిపింది. రాష్ట్రంలో 1.24 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను ఇంతవరకు 42.76 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభమైందని వెల్లడించింది.
నిర్మల్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, ములుగు, జనగామ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట, నల్గొండ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ప్రధాన పంటలైన వరి, వేరుసెనగ, మొక్కజొన్న, పెసలు, బొబ్బర్లు, మినుము పంటల సాగు 25 శాతం కంటే తక్కువే ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వరి విస్తీర్ణంలో ఇంతవరకు 5.9 శాతం మాత్రమే సాగు చేపట్టినట్టు పేర్కొంది. అలాగే వేరుసెనగ 4శాతం, మొక్కజొన్న 23.6 శాతం, పెసలు 17శాతం,మినుములు 16శాతం, జొన్న 13శాతం మేర సాగవుతున్నట్టు తెలిపింది.