Friday, October 18, 2024
Homeసినిమాతుదిద‌శ చిత్రీక‌ర‌ణలో అడివి శేష్‌ ‘మేజర్‌’

తుదిద‌శ చిత్రీక‌ర‌ణలో అడివి శేష్‌ ‘మేజర్‌’

అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న ‘మేజ‌ర్’ సినిమా చివ‌రి షెడ్యూల్‌ షూటింగ్ ఈ రోజు (ఆగ‌స్ట్‌ 12న ) ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది చిత్ర యూనిట్‌. ఇటీవల విడుదలైన టీజర్‌కు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించ‌డంతో పాటు, ప్రతి ఒక్కరు యూనిట్‌ను ప్రశంసించారు. భారీ అంఛ‌నాల‌తో రూపొందుతున్న ‘మేజ‌ర్’ ఫైన‌ల్ షెడ్యూల్ లో అడివి శేష్‌, సాయి ముంజ్రేక‌ర్ పాల్గొంటారు. ఆగ‌స్ట్ చివ‌రిక‌ల్లా షూటింగ్ పూర్త‌వ‌నుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్‌ విడుద‌ల‌చేసిన అడివి శేష్ స్టిల్ ఆక‌ట్టుకుంటుంది.

ఈ సందర్భంగా అడివిశేష్ మాట్లాడుతూ… “ఈ సినిమా నా డ్రీం ప్రాజెక్ట్‌. కొన్నాళ్ల క్రితం వార్తల్లో ఆ విషాద సంఘటనను చూసిన‌ప్ప‌టి నుండి ఈ చిత్రంతో నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం నేను మిశ్రమ భావోద్వేగాలతో మునిగిపోయాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వంటి ధైర్య‌వంతుడి పాత్ర‌ను నాకిచ్చినందుకు వారి త‌ల్లితండ్రుల‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ అమరవీరుడి స్ఫూర్తిదాయకమైన జీవితానికి నివాళి అర్పించడంలో విజయం సాధించాలని ఆశిస్తున్నాను” అన్నారు.

నవంబరు 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రజల ప్రాణాలను రక్షించిన అమరవీరుడు సందీప్‌ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ద‌ర్శ‌కుడు. అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ్ళ, ప్రకాష్‌రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు. మ‌హేష్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ఫ్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంస్థల అసోసియేషన్‌తో సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న మేజ‌ర్ చిత్రం హిందీ, తెలుగు, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాదిలోనే విడుద‌ల‌ కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్