Tuesday, September 17, 2024
HomeTrending Newsనానో యురియాతో రైతులకు మేలు

నానో యురియాతో రైతులకు మేలు

నానో యూరియా విరివిగా వాడండని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర రైతాగానికి పిలుపు ఇచ్చారు. నానో యూరియా భారతీయ రైతుల సొంత ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో)చే నానో టెక్నాలజీ ద్వార ఆవిష్కరింపబడిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఈ రోజు  జరిగిన సమావేశంలో గుజరాత్ రాష్ట్రంలోని కలోల్ నుండి తెలంగాణకు బయలుదేరిన మొదటి నానో యూరియా ట్రక్ ను ఆన్ లైన్ ద్వారా జెండా ఊపి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంఘానీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఇఫ్కో విడుదల చేసిన నానో యూరియా ప్రభుత్వాలకు సబ్సిడీ భారాన్ని, రవాణ, నిల్వ ఖర్చులు తగ్గిస్తుందని మంత్రి వెల్లడించారు.

ఒక బస్తా మీద దాదాపు రూ.800 నుండి రూ.1000 వరకు ప్రభుత్వాలకు సబ్సిడీ భారం తగ్గుతుందన్న మంత్రి  కేవలం రూ.240 కి లభించే 500 ఎంఎల్ లిక్విడ్ బాటిల్ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పని చేస్తుందన్నారు. ప్రపంచంలో మొదటి సారిగా ఈ నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ కలిగి ఉండడం సంతోషకరమన్నారు.ప్రస్తుతం యూరియా వల్ల భూమికి , నీటికి, గాలికి అవుతున్న కలుషితాన్ని నానో యూరియా నివారించి పర్యావరణాన్ని కాపాడుతుండడం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే అంశం అన్నారు. కార్పోరేట్ సంస్థల నుండి కాకుండా ప్రభుత్వ పరిధిలోని సహకార సంస్థ నుండి ఇలాంటి పరిశోధనా ఉత్పత్తి రావడం ఆహ్వానించదగిన పరిణామం.

ఏ పంటకయినా పూతకంటే ముందు, విత్తిన 20 రోజుల తర్వాత యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యురియతో రెండుసార్లు పిచికారి చేసుకోవచ్చు. మామూలు యూరియాకు 30 శాతం సమర్ధత ఉంటే నానో యూరియా 80 శాతం సమర్ధంగా ఉండడంతో పాటు 8 శాతం దిగుబడి పెరుగుతుందని ఐకార్ పరిశోధనలలో వెల్లడయిందని మంత్రి వివరించారు. పంట ఉత్పత్తుల నాణ్యత కూడా అధికంగా ఉంటుందని తేలింది. ప్రస్తుతం వాడుతున్న యూరియా కన్నా తక్కువ మోతాదు, తక్కువ ధరలో ఎక్కువ ఫలితాలు నానో యూరియా ఇస్తుంది. ఇది పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే ప్రస్తుతం వాడుతున్న యూరియా వాడకం 50 శాతం తగ్గుతుంది. ఎరువుల నియంత్రణ చట్టం కింద ఆమోదం పొందిన ఈ నానో యూరియా క్షేత్ర స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్