Wednesday, March 18, 2026
Homeసినిమా'ఉడుంబు' తెలుగు రీమేక్ రైట్స్ పొందిన గంగపట్నం శ్రీధర్

‘ఉడుంబు’ తెలుగు రీమేక్ రైట్స్ పొందిన గంగపట్నం శ్రీధర్

Another Remake: మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఉడుంబు’ తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. ఈయన ఇంతకుముందు అంజలి టైటిల్ పాత్రలో ‘చిత్రాంగద’, సుమంత్ తో ‘ఇదం జగత్”; ఛార్మితో ‘మంత్ర-మంగళ’ వంటి పలు చిత్రాలతోపాటు సుకుమార్ ‘కుమారి 21ఎఫ్’ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయం సొంతం చేసుకున్నారు. తాజాగా రమ్యకృష్ణతో కన్నడలో  ‘శివగామి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

“ఉడుంబు” చిత్రాన్ని మలయాళంలో కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన “ఉడుంబు” మలయాళంలో అనూహ్య విజయం సాధించింది.
పలు అగ్రనిర్మాణ సంస్థలు ‘ఉడుంబు’ తెలుగు రీమేక్ రైట్స్ కోసం పోటీపడినప్పటికీ హక్కులు తమకు దక్కడంపై నిర్మాత గంగపట్నం శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు.  శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది.

దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువప్రతిభాశాలి “రత్నాకరం అనిల్ రాజు” ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ క్రేజీ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఇప్పటివరకు మలయాళంలో విజయం సాధించి తెలుగులో రీమేక్ అయిన చిత్రాలన్నీ దాదాపుగా ఇక్కడ కూడా అసాధారణ విజయం సాధించాయి. విక్టరి వెంకటేష్ “దృశ్యం, దృశ్యం-2″లతోపాటు ఇటీవల విడుదలై సంచలన విజయం సాధిస్తున్న “భీమ్లా నాయక్” ఇందుకు తాజా ఉదాహరణ. అలాగే మెగాస్టార్ నటిస్తున్న “గాడ్ ఫాదర్” చిత్రం కూడా మలయాళంలో రూపొంది సంచలన విజయం సాధించిన “లూసిఫర్”కు రీమేక్ అన్న విషయం కూడా ఇక్కడ గమనార్హం. ఈ నేపధ్యంలో మళయాళంలో మంచి హిట్టయిన “ఉడుంబు” సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.

మలయాళంలో భారీ విజయం నమోదు చేసిన “ఉడుంబు” చిత్రాన్ని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా, తమిళంలో ఓ సీనియర్ హీరోయిన్ తన తనయుడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రీమేక్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular