Saturday, September 21, 2024
HomeTrending News'ఆడుదాం ఆంధ్ర'- క్రీడా సంబురాలు : సిఎం నిర్ణయం

‘ఆడుదాం ఆంధ్ర’- క్రీడా సంబురాలు : సిఎం నిర్ణయం

గ్రామస్థాయి నుంచి నైపుణ్యవంతమైన క్రీడాకారులను తయారు చేసేలా అధికారులు, క్రీడా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో  ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఆటగాళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలోనూ క్రీడలకు సమున్నత ప్రోత్సాహం అందిస్తూ,  భవిష్యత్తులో ఏపీ నుంచి ఒక ఐపీఎల్‌ టీం తయారయ్యే లక్ష్యంతో  46 రోజుల పాటు రాష్ట్రంలో ‘ఆడుదాం ఆంధ్ర’’ పేరుతో  క్రీడా సంబురాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

చెన్నై సూపర్‌కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో పోటీలు:
అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తయారు చేయడం కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ సాయం తీసుకోనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. క్రికెట్‌ లాంటి ఆటలో సీఎస్‌కె మార్గదర్శకం చేస్తుందన్నారు. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్‌ లాంటి జట్టు మేనేజిమెంట్‌ సాయం కూడా తీసుకుని.. ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్‌ జట్టు ఉండేలా అందులో ఆంధ్రా ఆటగాళ్లు ఎక్కువమంది ఉండేలా ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి పని చేస్తున్నామన్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌ మేనేజిమెంట్‌ ఆధ్వర్యంలో మూడు క్రికెట్‌ స్టేడియాల్లో క్రికెటర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం వివరించారు. దీనివల్ల ఆటగాళ్లలో ప్రొఫెషనలిజం పెరుగుతుందన్నారు.

అంబటి రాయుడు, కేఎస్‌ భరత్‌ స్పూర్తితో…
రాష్ట్రంలోని యువకులకు.. క్రికెటర్లు అంబటి రాయుడు, కేఎస్‌.భరత్‌ వంటి వారు స్ఫూర్తిదాయకులని సీఎం జగన్‌ అన్నారు. వారి సేవలను కూడా వినియోగించు కోవాలని ఆయన సూచించారు. తొలుత జిల్లా స్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్‌గా క్రికెట్‌ ఆడించే పరిస్థితి రావాలని సీఎం ఆకాంక్షించారు. ఇక క్రీడాపోటీల నిర్వహణకు ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పోటీల్లో మండల స్థాయికి వచ్చేసరికి ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

గ్రామ స్థాయిలో క్రీడా సామగ్రి అందజేయాలి
గ్రామస్థాయిలో క్రీడా సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. ఆటల్లో గెలిపొందిన వారికి బహుమతులతోపాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలన్నారు. భవిష్యత్తులో సచివాలయానికి కూడా క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్‌. భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్‌ స్టేడియం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రానున్న రోజుల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖో–ఖో వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. బాలురు, బాలికలు ఈ క్రీడల్లో పాల్గొనేలా చూడాలన్నారు. దీంతోపాటు 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, సంప్రదాయ ఆటల పోటీలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. సచివాలయాల స్థాయిలో మొదలుకుని, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు ఉండాలన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర ‘ అనే పేరుతో 46 రోజులపాటు ఆటల పోటీలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల మైదానాలు, మున్సిపల్‌ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, యూనివర్సిటీ మైదానాలను వినియోగించుకోవాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ జి వాణీమోహన్, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(ఎస్‌ఎఎపీ) ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఏపీ వీసీ అండ్‌ ఎండీ కె హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్