Tuesday, September 17, 2024
HomeTrending Newsయుద్ధం గెలిచి తీరాల్సిందే: బాబు హితబోధ

యుద్ధం గెలిచి తీరాల్సిందే: బాబు హితబోధ

ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించిందని.. ఇప్పుడు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా తో కూడా సంబంధాలు పెట్టుకున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ను డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  ఇక్కడ సంపాదించిన అక్రమ సొమ్మును హవాలా పేరుతో విదేశాలకు తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ డ్రగ్స్ తో సంబంధం ఉన్న సంధ్యా ఆక్వా కంపెనీ యజయాని  వైసీపీ నేత పూర్ణచంద్రరావుకు సోదరుడని తేలిందన్నారు. వీరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కూడా సంబంధాలున్నట్లు తెలుస్తోందని అన్నారు.  బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్ వచ్చిందని… అక్కడి అధ్యక్షుడు గెలవగానే వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారని.. దీనితో ఈ మాఫియా వెనుక వైసీపీ నేతలు ఉన్నట్లు అర్ధం అవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధులకు విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఓ వర్క్ షాప్ నిర్వహించారు. చంద్రబాబు తమ పార్టీ అభ్యర్ధులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రచారం నిర్వహించాల్సిన తీరు తెన్నులు, కూటమి లోని మూడు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలనేదానిపై నేతలకు హితబోధ చేశారు.

చంద్రబాబు మాట్లాడుతూ ఈసారి కూడా వైసీపీ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని, ఎలాంటి అవకాశాన్నీ వదలకూదదన్న ఉద్దేశంతోనే, రాష్ట్రాన్ని కాపాడడం కోసం కూటమిగా పోటీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర సహకారం ఎంతో అవసరమని స్పష్టంచేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు  చీలనివ్వబోనని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.

అభ్యర్ధుల ఎంపికలో ఎంతో కసరత్తు చేశామని, ఎన్నో సర్వేలు చేశామని…  చాలాకాలంగా పార్టీకి సేవ చేస్తున్న వారికి కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని… సీట్లు రానివారు కష్టపడలేదని అనుకోవద్దని, రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నామని అనుకోవాలని హితవు పలికారు. అభ్యర్ధుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు ఓడిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. మూడుపార్తీల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమైన అంశమని…మనం చేసే యుద్ధంలో గెలిచి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. కూటమి తరఫున నిలబడ్డ అభ్యర్ధి గెలవాలన్నదే మూడు పార్టీల లక్ష్యమన్నారు.

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బిజెపి నేత పాతూరి నాగభూషణంతో పాటు నేతలు, అభ్యర్ధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్