Saturday, March 14, 2026
HomeTrending Newsనీటి వివాదం దురదృష్టకరం: సీదిరి

నీటి వివాదం దురదృష్టకరం: సీదిరి

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదం సామరస్యంగా పరిష్కారం కావాలని దేవుణ్ణి వేడుకున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. జల వివాదాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమకు రావాల్సిన నీటి వాటా సంపాదించుకునేలా శ్రీవారి ఆశీస్సులు కావాలన్నారు. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బైట పడుతున్నామని, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా శ్రీవారి కృప ఉండాలని అయన ఆకాంక్షించారు.

నిన్న చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో అప్పలరాజు పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గం, వేంపల్లి గ్రామంలో పాడి మహిళా రైతులతో ఏర్పాటు చేసిన పాల వెల్లువ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం తిరుపతి శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ స్టూడియోను, అఖిల భారత పందుల పరిశోధనా సమన్వయ కేంద్రాన్ని సందర్శించారు. పశుగణ క్షేత్ర సముదాయ కాంప్లెక్స్ ను ప్రారంభించి పశు వ్యాధి విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని పరిశీలించారు అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేడు తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.  తిరుమల పర్యటనలో మంత్రి వెంట తిరుపతి ఎంపి గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే  బియ్యపు మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular