Sunday, September 8, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఆగస్టు మూడో వారంలో క్లాసులు: సురేష్

ఆగస్టు మూడో వారంలో క్లాసులు: సురేష్

ఆగస్టు రెండు లేదా మూడో వారంలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచన ప్రాయంగా వెల్లడించారు. కోవిడ్ పరిస్థితులు, వైద్య ఆరోగ్య శాఖ సూచనలు పరిగణన లోకి తీసుకుని….ముఖ్యమంత్రి తో చర్చించిన తరువాత ఈ విషయమై తుది నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. జూలై 1 నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు వస్తున్నారని, వారికి 15 రోజుల్లో వర్క్ బుక్స్ అందిస్తామని, ఆ తర్వాత ఉపాధ్యాయులు విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తారని వివరించారు.

విద్యా సంవత్సరం ఆలస్యమవుతుందని హడావుడిగా భౌతిక తరగతులు మొదలు పెట్టలేమని, ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 60 లక్షల మంది విద్యార్ధులు ఉన్నారని, వీరందరికీ ఆన్ లైన్ విద్య సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు లాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ లు అందుబాటులో లేవన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం 10 శాతం విద్యార్ధుల కుటుంబాలు మాత్రమే స్మార్ట్ ఫోన్ లు వాడుతున్నారని సురేష్ వెల్లడించారు. అందుకే అమ్మ ఒడి పథకం కింద లాప్ టాప్ లు అందిస్తున్నామని, ఆ తర్వాత 50 శాతం మందికి ఆన్ లైన్ బోధనకు వీలుంటుందని చెప్పారు.

టెన్త్, ఇంటర్ పరీక్షాల ఫలితాల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలకు రూపకల్పన చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. ఛాయా రతన్ ఛైర్ పర్సన్ గా హై పవర్ కమిటీ ఏర్పాటు చేశామని సురేష్ చెప్పారు. నివేదిక రాగానే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైన ప్రక్రియ చేపట్టారో అధ్యయనం చేసి, శాస్త్రీయంగానే ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్