Wednesday, March 11, 2026
HomeTrending Newsవాలంటీర్లపై బొజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు

వాలంటీర్లపై బొజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు

వాలంటీర్లపై శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి  బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, వాటికి పార్టీతో సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆ  నియోజకవర్గంలో ఉన్న కొందరు వాలంటీర్లు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకై అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకునే బొజ్జల ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అచ్చెన్నాయుడు అన్నారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామని,  ఇదే విషయాన్ని  టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

నిన్న ఓ సమావేశంలో బొజ్జల మాట్లాడుతూ వాలంటీర్లను స్లీపర్ సెల్స్ గాను, టెర్రరిస్టులుగానూ అభివర్హించారు. కేవలం ఎన్నికల్లో ఉపయోగపడడం కోసం సిఎం జగన్ ఏర్పాటు చేసుకున్న ఓ వ్యవస్థ అని వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లతో పాటు, వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్పందించారు.  ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి వైకాపా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ సమర్ధించదని తేల్చి చెప్పారు.

ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టారని పేర్కొన్నారు. వాలంటీర్లపై కేసులు పడితే సిఎం జగన్ పట్టించుకోరని, ఒక్క సారి కేసు పడితే వారి భవిష్యత్ అంథకారమే అని వాలంటీర్లు గ్రహించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular