Wednesday, March 11, 2026
HomeTrending Newsకుప్పంలో లక్ష మెజార్టీ లక్ష్యం: బాబు సూచన

కుప్పంలో లక్ష మెజార్టీ లక్ష్యం: బాబు సూచన

రాష్ట్రంలో గాడితప్పిన పాలనను సరిచేయాల్సిన అవసరం ఉందని, అందుకే వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు సిఎం పదవి కొత్త కాదని, కానీ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దాల్సి ఉందని అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలని వ్యాఖ్యానించారు. రెండురోజుల కుప్పం పర్యటనలో భాగంగా  మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోసారి కల్లబొల్లి మాటలు చెప్పి, బెదిరించి మళ్ళీ ఓట్లు దండుకునేందుకు  వైసీపీ నేతలు వస్తారని కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాబు సూచించారు. ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంటే మనం మాత్రం వెనక్కు వెళుతున్నామని… రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్దలు మనసుపెట్టి పనిచేసిన ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించిందని, అందుకే మహిళా శక్తి ముందుకొచ్చి ఓట్లు వేయించాలని కోరారు. మగవాళ్ళు ఓటు వేయకపోతే తిండి కూడా పెట్టబోమని చెప్పాలని, అప్పుడే వారు మీ దారికి వస్తారని మహిళలతో అన్నారు.

ఓట్ల కోసం గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే స్థితికి వైసీపీ దిగజారిందని, ఈ ఎన్నికల్లో ఎవరైనా వైసీపీకి పనిచేస్తే వారు మన కుటుంబాలకు, సమాజానికి ద్రోహం చేసినట్లేనని పేర్కొన్నారు.  ఇళ్ళు ఇచ్చామని, రేషన్, పెన్షన్ ఇచ్చామని ఎవరైనా వాలంటీర్లు మీ దగ్గరకు వస్తే .. అది ఎవడబ్బ సొమ్మూ కాదని గట్టిగా సమాధానం చెప్పాలని, మీరు కట్టిన పన్నుల డబ్బులే 100 రూపాయలు లాక్కొని పది రూపాయలు ఖర్చు పెట్టారని, ఇదే విషయాన్ని ప్రతి ఒక్కరూ అందరికీ వివరించాలని విజ్ఞప్తి చేశారు. కుప్పంలో భారీ మెజార్టీతో తన విజయం ఖాయమైనా, దాన్ని లక్ష ఓట్లకు తీసుకురావాలని, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఇక్కడే రావాలని, దానికోసం కృషిచేయాలన్నారు. కుప్పంలో పర్యటిస్తే తనకు ఎంతో ఎనర్జీ వస్తుందని, తన గెలుపును ఈసారి కూడా రెన్యువల్ చేయాలన్నారు. రాష్ట్రానికి ఏదో చేశామని, తాము సిద్ధమని వారు చెబుతున్నారని కానీ వాళ్ళను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాబు ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular