Saturday, March 14, 2026
HomeTrending Newsవై కాంట్ పులివెందుల: గుడివాడ సభలో బాబు

వై కాంట్ పులివెందుల: గుడివాడ సభలో బాబు

వైసీపీ ప్రభుత్వం తీసుకు వస్తున్నది భూ రక్షణ చట్టం కాదని, ప్రజల పాలిట భూ భక్షణ చట్టం గా మారుతోందని తాము అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేశామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికే ఈ చట్టం తెస్తున్నారని… ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారని, రేపు భూముల దొంగలు పడతారని విమర్శించారు. గుడివాడలో జరిగిన ‘రా కదలిరా’ బహిరంగసభలో బాబు ప్రసంగించారు.

వైసీపీ పాలనలో తాము తెచ్చిన వంద సంక్షేమ పథకాలను రద్దు చేశారని, ఇది రద్దుల ప్రభుత్వమని.. నాలుగేళ్ళలో ఒక్కో కుటుంబంపై 4 లక్షల రూపాయల భారం వేశారని విమర్శించారు. జగన్ వై నాట్ 175 అంటున్నారని కానీ తాము వై కాంట్ పులివెందుల అంటున్నామని స్పష్టం చేశారు. పులివెందులలో జగన్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధంచేసిన తరువాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని గతంలో జగన్ చెప్పారని, కానీ మాట తప్పారని అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్, డీఎస్సీ ఏమయ్యాయని బాబు ప్రశ్నించారు. చేసిన పనులు ధైర్యంగా చెప్పుకునే పార్టీ టిడిపి అయితే తప్పులు చేసి పరదాలు కట్టుకుని తిరిగే పార్టీ వైసీపీ అంటూ ఎద్దేవా చేశారు.  జాబు రావాలంటే రాష్ట్రంలో టిడిపి-జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, తాము రాగానే యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ తొలిసారి గుడివాడ నుంచే పోటీ చేసి విజయం సాధించారని, ఎందరో మహానుభావులు పుట్టిన నేల కృష్ణాజిల్లా అని, అలాంటి గడ్డపై కొన్ని గంజాయి మొక్కలు పుట్టాయని వాటిని పీకి పారేస్తామని హెచ్చరించారు. రాజకీయాలకు జగన్ కొత్త భాష్యం చెబుతున్నారని, లోకేష్ ను, తనను తిడితేనే ఎంపి టిక్కెట్ ఇస్తామని చెబుతున్నారని, ఇదేమి రాజకీయమని విస్మయం వ్యక్తం చేశారు.

తిరుపతిలో ఓ అధికారి మున్సిపల్ ఎన్నికల్లో 20 వేల దొంగ వోట్లు చేర్పించడంలో సహకరించారని, ఎన్నికల సంఘం అతన్ని సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular