Thursday, March 12, 2026
HomeTrending Newsప్రజల పోరాటం.. కెసిఆర్ విలాసం - స్మృతి ఇరాని

ప్రజల పోరాటం.. కెసిఆర్ విలాసం – స్మృతి ఇరాని

నీళ్లు-నిధులు-నియామకాలు లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు నీళ్ల కోసం పోరాడుతున్నారు. నిధులన్నీ కేసీఆర్ కుటుంబమే దోచుకుంటోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. నియామకాలు కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయని విమర్శించారు. బిజెపి చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా బహిరంగసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ది, సంక్షేమానికి అనేక నిధులిస్తోందన్నారు. 2016లో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్దరించి 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో త్వరలో పున: ప్రారంభం కాబోతోందని చెప్పారు.

18 కోట్ల మంది పేదలకు 14 నెలలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందిస్తోందని, 20 నెలలైనా తెలంగాణ నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భ్రుతి అమలు కావడం లేదని కేంద్ర మంత్రి విమర్శించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తానని హామీ ఇఛ్చి అమలు చేయని వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఎంఐఎంను చూసి భయపడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు కారున్నా….కారు స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉంది. అట్లాంటప్పుడు తెలంగాణ ప్రజల వికాసం కోసం ఎలా పనిచేస్తారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కేంద్రం రూ.25 వేల కోట్ల నిధులను వెచ్చించిందని, స్టాండప్ ఇండియా స్కీం పేరుతో దళితులను పారిశ్రామికవేత్తలను చేశారన్నారు. రైతుల కోసం పెద్ద ఎత్తున పత్తిని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని, దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు భూసార పరీక్షల కోసం కార్డులిచ్చింది. ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తుంటే…కేసీఆర్ మాత్రం ఇక్కడి రైతులకు ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదు. భూసార పరీక్షలు నిర్వహించడం లేదని మండిపడ్డారు.

ఆయుష్మాన్ భారత్ పేరుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ. 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తుంటే…..కేసీఆర్ మాత్రం ఆ పథకాన్ని అమలు చేయకుండా పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారని స్మృతి ఇరాని ధ్వజమెత్తారు. కేసీఆర్…సొంత ఇంటి కోసం ప్రగతి భవన్ కట్టుకుంటారు. సెక్రటేరియట్ ను కూలగొట్టి కొత్తది కట్టుకుంటారు. కానీ పేదలకు మాత్రం ఉండటానికి సొంత ఇండ్లు నిర్మించి ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర ప్రభుత్వ నియంత, అవినీతి పాలనను ఎండగట్టేందుకు, కేంద్ర పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు బండి సంజయ్ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయవంతమైందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular