Friday, October 18, 2024
HomeTrending Newsప్రారంభానికి సిద్దమవుతున్న చర్లపల్లి రైల్వే టర్మినల్ 

ప్రారంభానికి సిద్దమవుతున్న చర్లపల్లి రైల్వే టర్మినల్ 

హైదరాబాద్ మహా నగరంలో నాలుగవ రైల్వే స్టేషన్ చర్లపల్లి టెర్మినల్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. 98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో హైదరాబాద్ లోని ఈ శాటిలైట్ టెర్మినల్ తెలంగాణలో నాల్గవ అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించనున్నది.
భాగ్య నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు చర్లపల్లి నుంచి MMTS రైళ్ళ ద్వారా చేరుకునేందుకు అనువుగా ప్రత్యేకంగా ప్లాట్ ఫారం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఘటకేసర్ నుంచి లింగంపల్లికి చర్లపల్లి మీదుగా రోజు రెండు ట్రిప్పులు తిరిగే ఎంఎంటిఎస్ రైళ్ళను రద్దీకి అనుగుణంగా పెంచనున్నారు.
నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో ప్రస్తుతం ఉన్న రద్దీని ఈ టెర్మినల్ తగ్గిస్తుంది. రూ. 434 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టేషన్‌లో 19 కొత్త లైన్లతో పాటు అదనంగా 15 జతల రైళ్లను నిలిపే సౌకర్యం కల్పిస్తోంది. ఈ టర్మినల్ తెలంగాణ రైల్వే అవసరాలను తీర్చడంలో ప్రముఖ పాత్ర పోషించనున్నది.
స్టేషన్ మూడు వైపులా రహదారులు ఉండగా ఒకవైపు పెండింగ్ లో ఉంది. రోడ్డు పనులు తొందరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జి.హెచ్.ఎం.సి అధికారులను ఆదేశించారు. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరానికి మరికొన్ని కొత్త రైళ్లతో పాటు కొత్త ప్రాంతాలకు రైళ్ళు ప్రారంభం అవుతాయని అధికారుల అంచనా.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించేందుకు సన్నద్దమవుతున్న దక్షిణ మధ్య రైల్వే… తుది దశలో ఉన్న చర్లపల్లి స్టేషన్ పనుల్ని వేగవంతం చేస్తోంది. చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు రానుండగా… పోచారం సెజ్ లో ఐటి సంస్థలు పెరగనున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
-దేశవేని భాస్కర్
RELATED ARTICLES

Most Popular

న్యూస్