Friday, October 18, 2024
HomeTrending Newsచిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకులు ప్రారంభం

చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకులు ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో  చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల ఏర్పాటు చేసింది.  తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -“చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంత‌రాయంగా ఆక్సిజ‌న్ పంపిణీ కొనసాగుతుంది. ఇక్క‌డ స్కార్సిటీ వ‌ల్ల చైనా నుంచి ఆక్సిజ‌న్ కాన్ స‌న్ ట్రేట‌ర్లు ఆర్డ‌ర్ చేశాం. ప్ర‌స్తుతం చాలా చోట్ల వీటి కొరత నెల‌కొంది. అత్యవసరంగా ఎక్క‌డ అవ‌స‌రం ఉంది అనేది తెలుసుకొని ఆక్సిజ‌న్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్ని జిల్లాల‌కు అవ‌స‌రం ఉన్న అన్నిచోట్ల‌కు పంపిణీ చేస్తాం. అలాగే ప్ర‌తిచోటా ఆక్సిజ‌న్ సిలిండర్లు ఎక్కడెక్కడ ఏ టైంలో చేరుకుంటున్నాయి అనేది ట్రాకింగ్ ప‌రిక‌రాన్ని కూడా టెక్నీషియ‌న్లు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుంది. అన్నిచోట్లా ఇది స‌ద్వినియోగం కావాల‌నే మా ప్ర‌య‌త్నం. రామ్ చ‌ర‌ణ్ ఈ ఏర్పాట్ల‌న్నీ చూస్తున్నారు“ అని అన్నారు.

జిల్లా అభిమాన సంఘాల అధ్య‌క్షుల ఆధ్వ‌ర్యంలో ఈ ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జ‌రిగింది. అనంత‌పూర్, గుంటూరు, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్నం, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల‌కు బుధ‌వారం సాయంత్రానికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి. బ్ల‌డ్ బ్యాంక్ నుంచి ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు.. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్ స‌న్ ట్రేట‌ర్లు పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఈరోజు బుధవారం నాడు ఆక్సిజన్ బ్యాంకులు  ప్రారంభమయ్యాయి.  ప్రతి జిల్లాల్లో ఆస్ప‌త్రి నుంచి ఆక్సిజ‌న్ కావాల‌ని కోర‌గానే సిలిండ‌ర్ల‌ను పంపిస్తారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ పంపిణీ ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్