ITC hotel in Guntur: ర్యాటక, వ్యవసాయ, పుడ్ ప్రసెసింగ్ రంగాల్లో ఐటీసీతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరులో ఐటీసీ వెల్కం హోటల్ ను సిఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరులాంటి పట్టణంలో ఫైవ్స్టార్ హోటల్ ఉండటం, అందునా ఐటీసీ భాగస్వామ్యం కావడం మంచి పరిణామమని… రాష్ట్రంలో తొలి లీడ్ ప్లాటినం సర్టిఫైడ్ ఫైవ్స్టార్ హోటల్ కావడం కూడా సంతోషించతగ్గ విషయం అంటూ ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజివ్ పూరికి సిఎం ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్య, వ్యవసాయం… ఈ మూడు రంగాల్లో సమూలమైన మార్పులు కనిపిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,700 రైతుభరోసా కేంద్రాలు(ఆర్బీకేలు) ఉన్నాయని… రైతులను విత్తనం నుంచి విక్రయం వరకు చేయిపట్టుకుని నడిపిస్తున్నాయని.. వీటిని ప్రైమరీ ప్రాసెసింగ్ స్థాయిలుగా పరిగణిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులే ఆర్బీకేల ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. గ్రామస్థాయిలో…. వ్యవసాయరంగంలో ఏ రకమైన మౌలిక సదుపాయలను ఇప్పటివరకూ కల్పించాం, ఇంకా ఏం చేయాలనేది తమ ప్రభుత్వానికి ముఖ్యమైన అంశమన్నారు. పార్లమెంట్ నియోజకవర్గస్థాయిలో సెకండరీ ప్రాససింగ్ లెవల్లో ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ఈ విషయంలో ఐటీసీ కూడా ముందుకు వచ్చి భాగస్వామ్యం కావడం ద్వారా కీలకమైన పాత్ర పోషించనుందని అయన వివరించారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, గృహనిర్మాణశాఖమంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.