Wednesday, March 11, 2026
HomeTrending NewsYS Jagan: ఇక ఇది సామాజిక అమరావతి: సిఎం

YS Jagan: ఇక ఇది సామాజిక అమరావతి: సిఎం

‘నేటి నుంచి ఇది మనందరి అమరావతి, సామాజిక అమరావతి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 50,793 ఇళ్ల నిర్మాణానికి గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్ వద్ద  సిఎం శంఖుస్థాపన  చేశారు. ఈ సందర్భంగా వెంకటాపాలెంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

పేరుకేమో రాజధాని అంటారని, కానీ ఇక్కడ నిరుపేద అక్క చెల్లెమ్మ లకు సెంటు స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టించి ఇస్తామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని విమర్శించారు హైకోర్టులో 18, సుప్రీం కోర్టులో 5 కేసులు చంద్రబాబు, గజ దొంగల ముఠా వేశారని, మూడేళ్ళ నుంచి పేదల తరుఫున ఆ కేసుల మీద పోరాడి విజయం సాధించామని వివరించారు.

“నిజంగా ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా ఎప్పటికీ నిలిచిపోయే రోజు అవుతుంది. పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత ఎన్నెన్నోఅవరోధాలు అధిగమించి ఈరోజు పేదల విజయంతో జరుగుతోంది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డు తగిలిన ప్రబుద్ధులు ఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక దత్తపుత్రుడు. ఇతరత్రా చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు. వీరంతా చివరి వరకు ఒక పేద వాడికి ఒక ఇళ్లు రాకూడదు, ఇంటి స్థలం రాకూడదని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈరోజుకి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గులు. వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలివ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారు, ఆ తర్వాత పేదలకు ఇళ్లు కట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారు” అంటూ సిఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ సమాజంలోనైనా నిన్నటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారని, మరో మెట్టు ఎదగాలనుకుంటారని, అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారని… కానీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటే దాన్ని దుర్మార్గం… అమానుషత్వం, రాక్షసత్వం అంటారని అన్నానారు. పేదలకు మంచి చేస్తుంటే అడ్డుకుంటూ దాన్నే హీరోయిజం అనుకుంటారని ఎద్దేవా చేశారు.  చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికా, సింగపూర్ నుంచి రావొచ్చు కానీ, ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న పేదవారికి మాత్రం ఇళ్లస్థలాలు ఇవ్వొద్దని కొన్ని పత్రికలూ రాయడం దుర్మార్గమని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంలో వీరు ఎక్కని గడప లేదు, దిగని గడప లేదని, కలవని కేంద్ర సెక్రటరీ కూడా లేడని… ఇంత మంది కలిసి చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారని ఆగ్రహం వ్యకం చేశారు. దేవుడి దయతో అన్నింటినీ అధిగమించి అడుగులు ముందుకు వేశామన్నారు.

పేదల ప్రభుత్వానికి, పెత్తందారులకు మద్య యుద్ధం జరుగుతోందని, దీనిలో పేదలు తమ శత్రువులపై విజయం సాధించారని పేర్కొన్నారు.  వాలంటీర్ల వ్యవస్థతో సేవలు అందిస్తుంటే దీన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular