Jagan in X-mas Celebrations: మూడురోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సిఎం సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, బంధువులు కూడా ఈ వేడుకల్లో సిఎంతో కలిసి హాజరయ్యారు. ప్రార్ధనల అనంతరం కేక్ కట్ చేశారు. వైఎస్ విజయమ్మ జగన్ కు కేక్ తినిపించి ముద్దాడారు. క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన జగన్, సమస్త మానవాళికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ క్యాలండర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు.
క్రీస్తు బోధనలు ప్రపంచంలో కోట్లాదిమందిని సన్మార్గంలో నడిపించడానికి దోహదం చేస్తున్నాయని జగన్ తన క్రిస్మస్ సందేశంలో వెల్లడించారు. కరుణ, సామరస్యం, క్షమాగుణం లాంటి అంశాలకు క్రీస్తు జీవితమే ఓ సందేశమని పేర్కొన్నారు. యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Also Read : ఆదిత్య బిర్లా ద్వారా 2వేల ఉద్యోగాలు :సిఎం