Sunday, September 8, 2024
HomeTrending Newsఆందోళన లేకున్నా అప్రమత్తత అవసరం: సిఎం

ఆందోళన లేకున్నా అప్రమత్తత అవసరం: సిఎం

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 పై ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారని, అయినా ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్‌ చేయాలని సూచించారు.  కొత్తవేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాల న్నారు.  ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.  కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని అధికారులు సిఎంకు వివరించారు.
డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని, అయితే జేఎన్‌–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని తెలిపారు.  లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని,  పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నామని వెల్లడించారు.  కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని,  గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పెడుతున్నామని,  అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు, అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధంచేస్తున్నామని, పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని సిఎం  దృష్టికి తీసుకు వచ్చారు. ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, డి–టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధంచేశామని,  56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని సిఎంకు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్