Wednesday, March 11, 2026
HomeTrending Newsఅప్రమత్తంగా ఉండండి : సిఎం కేసిఆర్

అప్రమత్తంగా ఉండండి : సిఎం కేసిఆర్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  గులాబీ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ. ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీస్, రెవిన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

కాగా, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్ తో పాటు  డీజీపీ మహేందర్ రెడ్డి,  రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి  సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జలు కూడా పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.  జిల్లాలో రెవిన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం కలుగ కుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే, హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్ లలో ఉన్న ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని సూచించారు.  ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి అందించాలని అన్నారు.  లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికకారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు.

జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular