Amul in Anantapuram : అమూల్ సంస్థ రాకతో ప్రైవేట్ డెయిరీలు కూడా లీటర్కు 5 నుంచి 20 రూపాయల మేర ధరలు పెంచాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రైవేటు డెయిరీలు చెప్పిందే క్వాలిటీ, వారు ఇచ్చిందే రేటు అన్న పరిస్థితులు ఉండేవని కానీ ఇప్పుడు మహిళలు పాల సేకరణలో మోసాలు, క్వాలిటీ లాంటి విషయాల్లో సంపూర్ణ అవగాహన ఏర్పరచుకున్నారని వెల్లడించారు. అమూల్ వచ్చిన తరువాత పరిస్థితులు అన్నీ మారిపోయాయని, ప్రైవేట్ డెయిరీలు కూడా పాలసేకరణలో పోటీపడేందుకు మార్కెట్లో రేట్లు పెంచక తప్పనిపరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అనంతపురం జిల్లాలో 85 గ్రామాల్లో ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న అమూల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.ఎస్ సోధి, కైరా మిల్క్ యూనియన్ ఎండీ అమిత్ వ్యాస్, బనస్కాంత మిల్క్ యూనియన్ ఎండీ సంగ్రామ్ చౌదరి, సబర్ మిల్క్ యూనియన్ ఎండీ అనిల్ బయాటీలకు సీఎం వైయస్ జగన్ కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
“ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి జరగాలి.. దీనికోసమే రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి ప్రాంతంలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాదాపు 4,900 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 11,690 ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది’ అని చెప్పారు. “వ్యవసాయానికి పాడి తోడైతేనే గిట్టుబాటు ఉంటుంది. పాడి పెంపుదలకు, పాల ఉత్పత్తికి అమూల్ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. అనంతపురం జిల్లాలో కూడా అమూల్ సంస్థ రంగప్రవేశం అభినందనీయం. ఇదొక మంచి శుభవార్త. పాడి పరిశ్రమ ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, రైతన్నకు కూడా మంచి జరుగుతుంది’’ అని సిఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే పాత 6 జిల్లాల్లో అమూల్ అడుగుపెట్టిందని, ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ‘జగనన్న పాలవెల్లువ’ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
Also Read : సెప్టెంబర్ నాటికి రాష్ట్రమంతటా అమూల్ :సిఎం