Tuesday, March 10, 2026
HomeTrending Newsఏపీ హోదాపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం

ఏపీ హోదాపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఓ పురుగు కన్నా హీనంగా చూస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, వైఎస్సార్సీపీ లు మోడీకి బానిసలుగా మారి గులాంగిరీ చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాఖండ్ కు ప్రత్యేక హోదా రావడంవల్ల అక్కడ 2 వేల పరిశ్రమలు వచ్చాయని, కానీ ఏపీకి మాత్రం మొండిచేయి చూపారన్నారు. విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా 25 మంది ఎంపిలు ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఏపీ భవన్ లోని అంబేద్కర్ విగ్రహంవద్ద షర్మిల ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆమె సీనియర్ కాంగ్రెస్ నేతలు కెవిపి రామచంద్రరావు, జేడీ శీలం, రఘువీరారెడ్డి, కెఏ రాజు లతో కలిసి ఇదే అంశంపై జాతీయ నేతలు శరద్ పవార్, సీతారాం ఏచూరి, తిరుచి శివలను కలిసి మద్దతు కోరారు.  ధర్నాలో కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్రం నిన్నటి ప్రవేశపెట్టిన 46 లక్షల కోట్ల బడ్జెట్ లో వెయ్యి రూపాయలు కేటాయించారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇచ్చిందని, దీనిపై సోమవారం చర్చ జరిగే అవకాశం ఉందని, రాష్ట్రానికి చెందిన పార్టీలు కూడా ఈ తీర్మానానికి మద్దతివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. విభజన హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కేంద్రంలో అధికారంలోకి వస్తే తోలి సంతకం హోదాపైనే చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని షర్మిల వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular