Saturday, September 21, 2024
HomeTrending NewsBhupalapally: ఎడతెరిపి లేని వర్షాలు...సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం

Bhupalapally: ఎడతెరిపి లేని వర్షాలు…సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్‌ కాస్ట్‌ కేటీకే (KTK) 2, 3 గనుల్లో 7,025 టన్నుల బోగ్గుఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సింగరేణి కాలరీస్‌కు రూ.1.72 కోట్లు నష్టం వాటిళ్లింది. భారీ వర్షాల నేపథ్యంలో 1.63 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి.

రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలతో ముప్పు పొంచి ఉందని, ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉండేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, దుర్బలమైన కాజ్‌వేలు, వంతెనలను ఇప్పటికే గుర్తించినట్టు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తెలిపారు. అగ్నిమాపక శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల కార్యాలయాల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసినట్టు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్