Sunday, March 15, 2026
HomeTrending Newsవరంగల్ MGM ఆస్పత్రిలో అత్యాధునిక సేవలు

వరంగల్ MGM ఆస్పత్రిలో అత్యాధునిక సేవలు

హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్య సదుపాయాలు వరంగల్ లో ఏర్పాటు అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను పూర్తి ఉచితంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్ MGM హాస్పిటల్ లో రూ.2 కోట్ల 14 లక్షల విలువైన కొత్త CT స్కాన్ ను ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు  ప్రారంభించారు.

ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని మంత్రి కొనియాడారు. ఎంజిఎంలో అత్యవసర, ఇతర అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని, ప్రస్తుతం ప్రారంభించిన ఈ సిటి స్కాన్ ద్వారా అన్ని రకాల స్కానింగ్ లు చేయడం జరుగుతుందన్నారు. అత్యవసర విభాగంలో ఏర్పాటు చేసిన ఈ CT ద్వారా, సత్వర చికిత్సకు వీలవుతుందని, ఇక ఎంజీఎం లో బయోమెట్రిక్ పద్ధతి అమలు అవుతున్నదని చెప్పారు.

రూ.15 లక్షలతో కొత్త ఎక్స్-రే, రూ. 40 లక్షల విలువైన అల్ట్రాసౌండ్ మెషిన్ ఏర్పాటు చేయడం జరిగిందని, 12 కోట్లతో MRI మెషిన్ త్వరలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. దాదాపు 65 మోకాళ్ల ఆపరేషన్లు మరియు 300 యాంజియోగ్రామ్ లు, క్యాథ్‌లాబ్ కేసులు ఇక్కడ జరిగాయని, ఎంజీఎం ను 1,000 పడకల నుండి 1,300 పడకలకు అప్ గ్రేడ్ చేశామని తెలిపారు.

మరో వైపు PMSSY సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ల ద్వారా సేవలు విస్తృత పరిచి, 1 కోటి రూపాయల విలువగల స్టంట్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పాత సెంట్రల్ జైలు స్థలంలో 11 వందల కోట్ల తో 24 అంతస్థుల అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే వరంగల్ లో ప్రపంచ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ గోపి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వలప దాసు చంద్ర శేఖర్, వైద్యులు, నర్సింగ్ staff, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular