Sunday, March 8, 2026
HomeTrending Newsకేసిఆర్ పాలనకు గోరీ కట్టడమే అజెండా : ఈటెల

కేసిఆర్ పాలనకు గోరీ కట్టడమే అజెండా : ఈటెల

ఫ్యూడల్, నియంతృత్వ పాలననుంచి తెలంగాణాను విముక్తి చేయడం, ఈ పాలనకు గోరీ కట్టడమే ఇకపై తన అజెండా అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఇన్నాళ్లుగా తనది లెఫ్ట్ అజెండా అని,  లౌకిక డి.ఎన్.ఏ. అన్న విషయం అందరికీ తెలిసిందేనని, ఇకపై తనది రైతు అజెండా కాదని, లెఫ్ట్ అజెండా కాదని కేసిఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యం, అజెండా అని స్పష్టం చేశారు. ప్రజలు అర్ధం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.  ఇప్పుడు ఎలాగైతే లౌకిక వాదిగా ఉన్నానో, అందరి మనిషిగా ఉన్నానో ఇకపై కూడా అలాగే ఉంటానని హామీ ఇచ్చారు.

ఈటెల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారూ. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం నడుచుకుంటూ వెళ్లి శాసన సభ కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు.

కమలాపూర్, హుజురాబాద్ నుంచి ఓటమి లేకుండా గెలిచానని, ప్రత్యెక రాష్ట్రమే తెలంగాణా ప్రజలకు శ్రీరామ రక్ష అంటూ సమైక్య పాలనపై రాజీలేని పోరాటం చేశానని గుర్తు చేసుకున్నారు. నిర్బంధాలు, కేసులు, బెదిరింపులు తమకు కొత్త కాదని, ఎన్నిటినో ఎదుర్కొని ఢిల్లీ మేడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, అలాగే ఇప్పుడు వీటిని ధీటుగా ఎదుర్కొని రాబోయే రోజుల్లో కేసియార్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

బి-ఫాం ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ అయినా, గెలిపించింది హుజురాబాద్ ప్రజలు కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఇతర పార్టీల నేతలు రాజీనామా చేయకుండానే మంత్రులుగా కూడా కొనసాగుతున్నారని, అలాంటప్పుడు మీరెందుకు రాజీనామా చేయాలని  కొంతమంది అడిగారని ఈటెల వెల్లడించారు.   టిఆర్ఎస్ శానసభ్యుడిగా  మిమ్మల్ని తొలగించే పరిస్థితే వస్తే అంతకంటే ముందుగా మీరే రాజీనామా చేయాలని హుజురాబాద్ ప్రజలు కోరారని, హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు, తెలంగాణా ప్రజల ఆశీస్సులతోనే  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజేందర్ ప్రకటించారు.

హుజురాబాద్ లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని, తెలంగాణా ఉద్యమ కారులకు, కెసియార్ కుటుంబానికి మధ్య పోరు జరగబోతోందన్నారు. తెలంగాణా ఆత్మగౌరవానికి, కెసియార్ అహంకారానికి-డబ్బుకి జరిగే ఎన్నికల్లో ప్రజలు తెలంగాణా వాదం వైపే నిలబడతారని ఈటెల విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణా రాష్ట్రం ఏ చైతన్యానికి నిలయమో, సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లు పెట్టుకొని పోరాడుతున్నమో, యావత్ సమాజం ఏ చైతన్యంతో అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిందో ఇవాళ ఆ సంఘాలను నిర్వీర్యం చేశారని వివరించారు. సంఘాలు, ఐక్యత, చైత్యన్యం తెలంగాణాలో ఉండవద్దనేదే కెసియార్ అభిమతమని అన్నారు. హుజురాబాద్ లో తన గెలుపు తెలంగాణా ఆత్మగౌరవ ప్రతీకగా నిలబబోతుందని ఈటెల అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular