Thursday, March 19, 2026
HomeTrending Newsరోజుకో తప్పు చేస్తున్నారు: అచ్చెన్న విమర్శ

రోజుకో తప్పు చేస్తున్నారు: అచ్చెన్న విమర్శ

జగన్ పాలనలో రాష్ట్రం అప్పు 9.27 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  బటన్ నొక్కి 1.80 లక్షల కోట్లు డిబిటి ద్వారా అందించారని సిఎం జగన్ స్వయంగా చెప్పారని, మిగిలిన డబ్బు ఏమి చేశారని,  కనీసం  గుడి, బడి, రోడ్లు కూడా వేయలేకపోయారని ధ్వజమెత్తారు. వ శ్రీకాకుళం జిల్లా నందిగం మండలంలో రైతులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్న అచ్చెన్నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. ఏ సర్వేలు చూసినా ఇదే విషయం వెల్లడవుతోందని, ఇది చూసే జగన్ మోహన్ రెడ్డికి మైండ్ బ్లాండ్ అయ్యిందని, రోజుకో తప్పు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఇబ్బందుల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతు తాను పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేఛ్చ ఉందని, కానీ ఈ ప్రభుత్వం ఫలానా చోటే అమ్మాలని షరతు పెడుతోందని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సి ఉండగా ఇప్పటి వరకో 4.20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. అధికారులను అడుగుతుంటే  లక్ష్యం పూర్తయిందని, ఇక కొనుగోలు చేయలేమని చేతులేట్టేస్తున్నారని,  రైతు భరోసా కేంద్రాలు ఎందుకు పెట్టారని, వాటివల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రైతులు విధిలేని పరిస్థితుల్లో తక్కువ రేటుకు అయినా అమ్ముకొని వదిలించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇన్ని బాధలు పెడుతున్నా రైతులు ఎందుకు రోడ్డెక్కడం లేదని, ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలేదని అడిగారు. రైతులు రోడ్డెక్కి తమ బాధలు చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular