Wednesday, March 18, 2026
HomeTrending Newsతెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం

తెలంగాణ కొత్త సచివాలయంలో ఈ రోజు వేకువ జామున అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయం మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. భారీ పొగలతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సరిగ్గా గుమ్మటం పైన భారీ పొగలు వస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ ద్వారా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. షార్ట్‌ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. వుడ్‌ వర్క్‌ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగినట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం కూడా సిద్ధమైంది.

నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరమని, ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. సీఎం పుట్టిన రోజునే (ఫిబ్రవరి 17న) కొత్త సచివాలయ ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని బండి కోరారు. ఫైర్ సేఫ్టీసహా అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular