Friday, September 20, 2024
HomeTrending Newsసమయంలేదు మిత్రమా: రాప్తాడు సభలో చంద్రబాబు

సమయంలేదు మిత్రమా: రాప్తాడు సభలో చంద్రబాబు

ప్రజాగళం యాత్రలు సూపర్ హిట్ అవుతుంటే జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, డబ్బులిచ్చి బిర్యానీ పంచినా జనాలు రావడంలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. నిన్నటివరకూ తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టి వేధించారని కానీ ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని… పరిపాలన ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని.. అందరూ ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పిలుపు ఇచ్చారు. రాప్తాడులో జరిగిన ప్రజాగళం బహిరంగసభలో బాబు ప్రసంగించారు.  రాష్ట్రాభివృద్ధికోసమే కూటమిగా ముందుకు వచ్చామని, ఈ 48 రోజులపాటు అందరూ కష్టపడి పనిచేసి గెలిపించాలని… ‘సమయం లేదు మిత్రమా’ అంటూ బాలకృష్ణ డైలాగ్ ను బాబు వినిపించారు.

రేట్లు పెంచితే మద్యం మానేస్తారంటూ ఓ కొత్త సిద్ధంతాన్ని తీసుకు వచ్చిన జగన్ ఒక్కో క్వార్టర్ బాటిల్ పై 14౦ రూపాయలు పెంచారని.. ఈ పెంచిన డబ్బులు తాడేపల్లి ప్యాలస్ కు వెళుతున్నాయని ఆరోపించారు. విద్యుత్ రెట్లు 9 సార్లు పెంచి పేదల నెత్తిన పెనుభారం మోపారన్నారు. దేవుడిచ్చిన సహజ వనరు అయిన ఇసుకను దోపిడీ చేస్తూ లక్షలాది భావన నిర్మాణ కార్మికుల పొట్ట గోట్టారన్నారు. రాప్తాడులో ఇసుక దొరకదని.. కానీ ఇక్కడి ఇసుక మాత్రం బెంగుళూరుకు వెళుతుందని..పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారని విమర్శించారు.

రాయలసీమ ప్రాంతంలో 52 సీట్లు ఉంటే గత ఎన్నికల్లో 49 సీట్లు వైసీపీకి ఇస్తే ఎలాంటి అభివృద్ధీ చేయలేదని రాబోయే ఎన్నికల్లో మొత్తం సీట్లు టిడిపిని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని భరోసా ఇచ్చారు. విశ్వసనీయత ఉందని, 99 శాతం హామీలు నేరవేర్చానని చెప్పుకుంటున్న జగన్ విభజన హామీలు ఎందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు.

ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పిన జగన్ మోసం చేశారని కానీ తాము అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంతమంది విద్యార్ధులుంటే అంతమందికి  వారి చదువుల కోసం ప్రతి  ఏటా 15 వేల రూపాయలు ఇస్తామని… ఎలాంటి అంక్షలూ ఉండవని భరోసా ఇచ్చారు.జనాభా పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతినెలా 4 వేల రూపాయల పెన్షన్ ను ఒకటో తేదీన ఇంటికే పంపుతామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్