Tuesday, March 10, 2026
HomeTrending Newsమనం రాకపోతే ఏమవుతుందో ప్రజలకు చెప్పండి: 'సిద్ధం'సభలో జగన్

మనం రాకపోతే ఏమవుతుందో ప్రజలకు చెప్పండి: ‘సిద్ధం’సభలో జగన్

రామాయణ, మహాభారత కావ్యాల్లోని విలన్లు అందరూ ఓ చంద్రబాబు, ఎల్లో మీడియా… దత్తపుత్రుడి రూపేణా, ఇతర పార్టీల్లో ఉన్న ఆయన కోవర్టుల రూపంలో ఉన్నారని, ఇంతమంది తోడేళ్ళందరూ బాణాలు పట్టుకొని తనపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారివైపు చూసినప్పుడు తాను ఒంటరిగా కనిపిస్తున్నానని, కానీ వాస్తవానికి ఇక్కడకు వచ్చిన కార్యకర్తలు నిజమని, ఇన్ని లక్షల హృదయాల్లో తనకు స్థానం ఇచ్చి, వారి బిడ్డగా ఉండడం నిజం అని.. తాను ఏనాడూ ఒంటరి కాదని… ఇంతమంది కార్యకర్తల బలంతో యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. పొత్తులు, ఎల్లో మీడియా  వారి సైన్యం అయితే… తన బలం, ధైర్యం, సైన్యం పైనున్న దేవుడు… అభిమానిస్తున్న ఇంతమంది జనం అంటూ ప్రజలనుద్దేశించి అన్నారు. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో యుద్ధంలో మీరు శ్రీకృష్ణుడు పాత్ర పోషిస్తే తాను అర్జునుడి పాత్రను పోషిస్తానని, ఈ జగన్ ఏనాడూ ఒంటరి కాదని ధీమా వ్యక్తం చేశారు. ఏలూరులో జరిగిన సిద్ధం బహిరంగసభలో వైఎస్ జగన్  పాల్గొన్నారు. “సిద్ధమా… మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా?” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు… మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరు సిద్ధమేనా? పేదల భవిష్యత్తును-పేదలను కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తూ ఉన్న కరోనా లాంటి దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి అందరూ సిద్ధమేనా?  వైసీపీని మరోసారి గెలిపించేందుకు మీరు సిద్ధమా? విపక్షాల కుట్రలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధమా? అంటూ ప్రజలను అడిగారు.

నాలుగున్నరేళ్లుగా తాము చేసిన మంచి పనులు వివరించి తన సైన్యాన్ని యుద్దానికి సిద్ధం చేసి రాబోయే ఎన్నికల్లో 175కి 175 ఎమ్మెల్యే సీటు, 25 ఎంపి సీట్లు గెల్చుకునేలా కర్తవ్య బోధ చేసేందుకే మీ ముందుకు వచ్చానన్నారు. గత ఐదేళ్ళ చంద్రబాబు పాలన, 57 నెలల తమ పాలనను బేరీజు వేసుకుని మేలు జరిగిందో లేదో చూసుకోవాలని ప్రతి లబ్దిదారుడినీ అడగాలని సూచించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను చీల్చి చెండాడాలని పిలుపు ఇచ్చారు.

తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ మరో వందమందికి తమకు జరిగిన మంచి గురించి చెప్పేలా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చెప్పాలని కోరారు. మరోసారి జగనన్నను సిఎం చేసుకునేలా తెలియజెప్పాలన్నారు. జగనన్న మన కోసం 124సార్లు బటన్ నొక్కి నిధులు డిబిటి ద్వారా పంపారని, అలాంటి జగనన్నకు ఓటు వేసేందుకు రెండు బటన్లు ఒకటి అసెంబ్లీకి, మరొకటి పార్లమెంట్ కు నొక్కాలని…  జగనన్నకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లు అని….  ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే లంచాలు, వివక్ష చూపే జన్మభూమి కమిటీలను బతికించినట్లేనన్న విషయం… ప్రతి ఇంటికీ చెప్పాలన్నారు. మరో గొప్ప ప్రజా విజయం సాధించేందుకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను జగన్ కార్యోన్ముఖులను చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular