Sunday, March 15, 2026
HomeTrending NewsYS Jagan Fire: బాబుకు పవన్ దాసోహం

YS Jagan Fire: బాబుకు పవన్ దాసోహం

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని, నలుగురు కలిసి లేపితే గానీ లేవలేని పరిస్థితిలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పోటీ చేసిన బాబు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయలేకపోతున్నారని అన్నారు.  పదేళ్ళ క్రితం పార్టీ పెట్టిన మరో నాయకుడు కనీసం 175 నియోజక వర్ఘాల్లో అభ్యర్ధులను కూడా పెట్టలేకపోయాడని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి దుయ్యబట్టారు. తాను సిఎం కాకపోయినా ఫర్వాలేదు కానీ దోపిడీలో తనకు రావాసిన వాటా వస్తే చాలు అన్నట్లుగా దత్తపుత్రుడి తీరు ఉందని విమర్శించారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా ఆర్ధిక సాయాన్ని నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.

ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని వ్యవస్థలు తనమీద కత్తిగట్టినా, తనమీద ప్రయోగించినా పదిహేనేళ్ళుగా తానూ ప్రజల తరఫున నిలబడ్డాను కానీ రాజీ పడలేదని స్పష్టం చేశారు. ‘మీ బిడ్డకు ధైర్యం మీరు, మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, దేవుడిని’ అంటూ ప్రజలనుద్దేశించి భావోద్వేగంతో  మాట్లాడారు.

తాము ప్రజలను నమ్ముకుంటే, విపక్షాలు మాత్రం పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. బాబు పేరు చెబితే గుర్తొచ్చేది వెన్నుపోటు మాత్రమేనన్నారు. రెండు సినిమాలకు మధ్య షూటింగ్ విరామంలో పొలిటికల్ మీటింగ్స్ కు వస్తుంటారని పవన్ పై జగన్ విమర్శలు చేశారు. అప్పుడు కూడా బాబు స్క్రిప్ట్ ప్రకారం ప్యాకేజీ స్టార్ వచ్చి మాట్లాడి.. తన మీద నాలుగు రాళ్ళు వేసి వెళతాడంటూ ఫైర్ అయ్యారు.

ప్రతిపక్ష నేతగా  ఉన్నప్పుడే తాను తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకున్నానని, గత ఐదేళ్ళపాటు సిఎంగా పనిచేసిన బాబు ఇక్కడ కాకుండా హైదరాబాద్ లో ప్యాలెస్ నిర్మించుకున్నారని గుర్తు చేశారు.  దత్త పుత్రుడికి-దత్త తండ్రికి మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉందని,   ఆయన ఏం చెబితే అది చేసేందుకు ప్యాకేజ్ స్టార్ సిద్ధంగా ఉంటారని ధ్వజమెత్తారు. కలిసి వెళ్దామని చెప్పినా, విడిగా పోటీ చేద్దామని చెప్పినా ‘చిత్తం ప్రభు’, ‘అలాగే సర్’ అనే పరిస్థితి నెలకొని ఉందన్నారు.  బిజెపితో కలవమని కూడా పవన్ కు బాబే చెప్పారని జగన్ ఆరోపించారు. బిజెపికి విడాకులు ఇవ్వమని బాబు చెబితే వెంటనే ఇవ్వడానికి పవన్ సిద్ధంగా ఉంటారన్నారు. దత్తబాబు ఇచ్చే ప్యాకేజ్ కోసం ఎలాంటి వేషం అయినా వేయడానికి సిద్ధపడే దత్తపుత్రుడంటూ పవన్ నిపులు చెరిగారు. కర్ణాటకలో బిజెపి ఓడిపోతే ఇది తమ విజయంగా సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు, ఆ పార్టీ నేతలు… ఇక్కడ ఏపీలో మాత్రం బిజెపి తమతో కలిసి నడవాలని కోరుతున్నారని, ఇదేమి రాజకేయమని నిలదీశారు.

దేశంలో ప్రధాని, రాష్ట్రపతులను తానే చేశానని  కోతలు కోసే చంద్రబాబుకు… రాష్ట్రంలో ఒంటరిగా 175నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా కూడా లేదని, కనీసం రెండో స్థానం వంస్తుందన్న నమ్మకం కూడా లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular