Saturday, March 14, 2026
HomeTrending Newsకుటుంబాలను చీలుస్తారు: సిఎం జగన్ వ్యాఖ్యలు

కుటుంబాలను చీలుస్తారు: సిఎం జగన్ వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో విపక్షాలు అనేక కుట్రలు,కుతంత్రాలకు పాల్పడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచనల ఆరోపణ చేశారు. విపక్షాలు అనేక పొత్తులు పెట్టుకుంటాయని, కుటుంబాలను చీలుస్తారని వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై జగన్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని, బెంజ్ కారు ఇస్తామంటూ విపక్షాలు చెబుతాయని, మోసం చేస్తాయని అప్రమత్తంగా ఉంటాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా రూ. 3000 అందించే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో సిఎం జగన్ ఈ  కామెంట్లు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ ప్రధాని నరేంద్ర మోడీకి  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాసిన లేఖపై జగన్ మండిపడ్డారు. హౌసింగ్ పథకం ఆపాలని చూస్తున్న పవన్.. అవినీతి కేసులో చంద్రబాబు జైలుకు వెళితే ఈ దత్తపుత్రుడు వెళ్లి పరామర్శించి వచ్చారని ఎద్దేవా చేశారు.

“ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మరీ లక్షాధికారులను చేయాలని గూడు ఉండాలని ప్రయత్నం జరుగుతోంది. 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒకాయన ఉన్నాడు. ఆయనకొక దత్తపుత్రుడూ ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్తతండ్రి ఇద్దరూ కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో వారు చెప్పిన మాట ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి చివరికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు.
ఆనాడు మాత్రం ఆ దత్తతండ్రి అక్కచెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు కనీసం ఏ ఒక్కరోజూ ప్రశ్నించకపోగా, కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు, ఇవాళ మీ బిడ్డ 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలకు కట్టే ఇళ్లలో, ఇంటి స్థలాల్లో అవినీతి జరిగిందట అని రాస్తాడు” అని జగన్ విమర్శలు గుప్పించారు.

“చంద్రబాబు అంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఈ పెద్దమనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా మాట్లాడడు. మన ప్రభుత్వం విషయానికొస్తే అవినీతి జరగక పోయినా అభాండాలు వేస్తాడు. చంద్రబాబు అవినీతి చేసినా ఈ పెద్దమనిషి నోరు ఎందుకు మెదపడంటే ఆ అవినీతిలో ఈయన కూడా పార్టనర్ కాబట్టి.  వడూ నోరుమెదపడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ప్రశ్నించడు, మాట్లాడరు” అంటూ పవన్ తో పాటు కొన్ని మీడియా సంస్థలపై కూడా జగన్ ధ్వజమెత్తారు.

విపక్షాల మాదిరిగా తనకు కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడటం, రాజకీయాలు చేయడం చేతకాదని, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటమే తనకు తెలిసిన రాజకీయం అని జగన్  స్పష్టం చేశారు.  తాను పైన ఉన్న దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని నమ్ముకున్నానని పునరుద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular